మొపాస కథలు: దత్తుడు బాబు

మా వూరి సముద్రతీరం దగ్గరగా వున్న కొండకిందగా రెండు పూరిపాకలు కనిపిస్తాయి. ఆ రెండు గుడిసెల్లో వుండేది రెండు రైతు కుటుంబాలు. ఇద్దరు రైతులకీ నలుగురేసి పిల్లలు. ఆ పిల్లల్ని పోషించుకోడానికి వాళ్ళకున్న నాలుగు పరకల బంజరు భూముల్లో చమటోడ్చి పనిచేసేవాళ్ళు ఇద్దరూ. ఆ రెండు ఇళ్ళ ముందు వున్న ఖాళీ స్థలంలో ఆ ఎనిమిది మంది పిల్లలూ పగలూ రాత్రి దుమ్ములో పడి ఆడుకుంటూ వుండేవాళ్ళు. అందరికన్నా పెద్దవాళ్ళైన ఇద్దరు పిల్లల వయసు ఆరు సంవత్సరాలు అయితే అందరికన్నా చిన్న వాడి వయసు సంవత్సరం మీద మూడు నెలలు. ఇద్దరు రైతుల పెళ్ళిల్లు ఆ తరువాత పిల్లలూ దాదాపు ఒకే సమయం జరిగాయి. అందువల్లనేనేమో ఆ పిల్లలందరిలో ఎవరు ఎవరి పిల్లలని చెప్పడం కొంచెం కష్టమే. ఆ పిల్లల తల్లులే అప్పుడప్పుడు తికమక పడేవాళ్ళు. తండ్రుల సంగతి చెప్పేదేముంది. ఎనిమిది పేర్లు వాళ్ళ జ్ఞాపకశక్తికి పరీక్ష పెట్టేవి. ఒకరిని పిలవబోయి మరొకరి పేరు పలకడం, మళ్ళీ పొరపాటు తెలుసుకోని సరిదిద్దుకోవటం వాళ్ళకి పరిపాటి అయిపోయింది.

సముద్రం పక్కన వున్న రోలెపోర్ట్ బీచ్ నుంచి వస్తుంటే మెదట తారసపడేది టువచే కుటుంబం. ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు వాళ్ళ సంతానం. రెండో ఇంట్లొ వుండే వాలిన్ కుటుంబానికి ఒక కూతురు ముగ్గురు కొడుకులు.

అందరు పిల్లలూ గంజి నీళ్ళు, బంగాళదుంపలతోపాటు చల్లగాలిని కూడా అనుభవిస్తూ పెరుగుతున్నారు. ఉదయం ఏడుగంటలకి ఒకసారి, మధ్యాహ్నం ఒంటిగంటకి ఒకసారి, సాయంత్రం ఆరుగంటలకొకసారి తల్లులిద్దరూ వండిన నాలుగు మెతుకులు తీసుకోని వచ్చేవాళ్ళు. పిల్లలందరినీ బాతుల మందని తోలినట్లు కష్టపడి ఒకచోటికి చేర్చేవాళ్ళు. అండరినీ వారి వారి వయసులని బట్టి వరసగా ఒక చెక్కబల్ల చుట్టూ కూర్చోబెట్టి, తెచ్చిన ఆహారం ఏదో వాళ్ళకి పెట్టేవాళ్ళు. యాభై ఏళ్ళుగా వాడుతున్న ఆ చక్కబల్ల అరిగి అరిగి నునుపుగా మెరుస్తూ వుండేది. ఆ బల్ల మీద పెట్టిన ఆ కాస్త ఆహారాన్ని ఆవురావురంటూ ఆకలి తీరేదాకా తినేవాళ్ళు పిల్లలంతా. పసివాళ్ళైన ఇద్దరికి మాత్రం తల్లులే పెట్టేవాళ్ళు. ఆదివారాలు మాత్రం ఏదో కాస్త నీసు కూరలు వండితే ఆ రోజు తండ్రులు కూడా పిల్లలతో కూర్చోని చాలాసేపు తినేవాళ్ళు. ఇలాంటి ఆదివారాలు రోజూ వస్తే ఎంత బాగుంటుందో అనుకునేవాళ్ళు.

ఒక ఆగష్టు నెల మధ్యాహ్నం అనుకోని విధంగా ఒక గుర్రబ్బండి వాళ్ళ ఇంటి ముందు ఆగింది. అందులో కూర్చోని వున్న ఒక స్త్రీ అక్కడ ఆడుకుంటున్న పిల్లలను చూసి, పక్కనే వున్న భర్తకి కూడా చూపించింది.

"
ఆ పిల్లల్ని చూశారా హెన్రీ... ఎంత ముద్దుగా వున్నారో. ఆ దుమ్ములో పడి వాళ్ళ ఆటలు చూడండి" అంది సంబరంగా.

అతను సమాధానం చెప్పలేదు. పిల్లల్ని చూసినప్పుడల్లా ఆమె అలా మాట్లాడటం, మాటల్లో కొంత విషాదం ధ్వనించడం అతనికి అలవాటైపోయింది.

"
ఎంత ముద్దొస్తున్నారో... ఒక్కసారి దగ్గరికి తీసుకోని ముద్దుపెట్టుకోవాలి... కాదు కాదు వీళ్ళలో ఒకరిని నేను తీసుకెళ్ళిపోవాలి... అదిగదిగో వాడు... ఆ చిన్నవాడు.. వాడు కావాలి నాకు.."

అలా అంటున్నదల్లా ఒక్కసారి బండిలోనుంచి దూకి పిల్లల దగ్గరకు పరిగెత్తుకొచ్చి, టువచే చిన్న కొడుకుని ఎత్తుకుంది. దుమ్ము కొట్టుకున్న వాడి బుగ్గ్గలకి ముద్దులు పెట్టింది. మట్టి నిండిన తల పైన నెమిరింది. చిన్ని చిన్ని చేతుల్ని తన చేతుల్తో పట్టుకుంది. ఆ పిల్లాడు మాత్రం ఉన్నట్టుంది వచ్చిపడ్డ ప్రేమని తట్టుకోలేక విడిపించుకోవాలని విశ్వప్రయత్నం చేశాడు. కాస్సేపటి తరువాత ఆ పిల్లాణ్ణి వదిలేసి ఆమె మళ్ళీ గుర్రబ్బండి ఎక్కేసి, భారంగా కదిలి వెళ్ళిపోయింది.

అప్పటికైతే వెళ్ళిపొయింది కానీ తరువాత వారం మళ్ళి వచ్చింది. ఆ మట్టిలోనే కూర్చోని తనతో తెచ్చిన పండ్లు, మిఠాయిలు వాడి చేతులనిండా పెట్టింది. మిగిలిన పిల్లలకి చాక్లెట్లు, పిప్పరమెంట్లు ఇచ్చింది. తనూ ఒక చిన్నపిల్ల అయినట్లు వాళ్ళతొ కలిసి ఆడింది. ఆమె తిరిగివచ్చేదాకా ఆమె భర్త గుర్రబ్బండిలోనే ఎదురుచూశాడు. తరువాత వారం మళ్ళీ వచ్చింది. ఈ సారి తల్లిదండ్రులతో పరిచయం చేసుకుంది. ఆ తరువాత రోజూ రావటం మొదలుపెట్టింది. వచ్చినప్పుడల్లా చిల్లర డబ్బులు, తినడానికి ఏదో ఒకటి తెచ్చి పంచిపెట్టేది.

ఆమె పేరు మేడమ్ హెన్రీ డి’ హుబియే.

ఒకరోజు ఉదయాన్నే వచ్చారు వాళ్ళు. ఆమెతో పాటు ఆమె భర్త కూడా దిగాడు. ఇద్దరూ వడివడిగా అడుగులేసుకుంటూ అలవాటైన పిల్లలు వారివైపు చూస్తున్నా పట్టించుకోకుండా గుడిసె లోపలికి వెళ్ళారు. లోపల భార్యాభర్త ఇద్దరూ కట్టెలు కొట్టే పనిలొ వున్నారు. ఒక్కసారిగా లోపలికి వచ్చినవారిని ఆశ్చర్యంగా చూసి, హడావిడిగా రెండు బల్లలు వేసి కూర్చోబెట్టి ఏం చెప్తారో అన్నట్లు ఆసక్తిగా నిలబడ్డారు. వచ్చినావిడ గొంతు సవరించుకోని వణుకుతున్న కంఠంతో చెప్పడం మొదలుపెట్టింది.

"నేను.... మిమ్మల్నే కలవడానికి వచ్చాను. మీ మంఛితనం గురించి తెలిసి ఒక విషయం అడగాలని వచ్చాను. నేను - నేను... నేను అడగబోయేది ఏమిటంటే... నాతో మీ అబ్బాయిని తీసుకెళ్ళాలని అనుకుంటున్నాను"

ఆ పేదవాళ్ళు ఇద్దరూ వాళ్ళ ఊహల్లోకి కూడా రాని ప్రతిపాదన విని ఆలోచన కూడా చెయ్యలేని స్థితిలో స్థాణువుల్లా నిలబడిపొయారు.

ఆమె గట్టిగా ఊపిరి తీసుకోని ధైర్యాన్ని కూడగట్టుకోని - "మేము ఇద్దరమే వుంటాము ఇంట్లో. ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా మా ఇంట్లో పారాడే పాపాయి పుట్టలేదు. అండుకే అడుగుతున్నాను. మీ పిలాణ్ణి మాకు ఇచ్చేస్తారా? మేము పెంచుకుంటాము." అంది.

భార్యాభర్త ఇద్దరూ ముఖముఖాలు చూసుకున్నారు.

"ఏంది? మా ఛార్లట్ ను మా నుంచి తీసుకెళ్ళిపోతారా? అయ్యో... కుదరదు. అదెట్లా కుదురుతుంది?" అన్నదామె.

హెన్రీ ముందుకు వచ్చాడు.

"ఆవిడ చెప్పిన మాటలు మీకు అర్థం కాలేదనుకుంటాను. మేము వాణ్ణి దత్తత తీసుకుంటాము. మిమల్ని చూడటానికి, కలవడానికి ఎలాంటి అభ్యంతరమూ ఉండదు. అంతా సజావుగా సాగితే వాడే మాకు వారసుడౌతాడు. ఒకవేళ మాకు తరువాత సంతానం కలిగినా ఆస్థి వీడికి కూడా సమానంగా పంచుతాము. పెద్దైన తరువాత మీ అబ్బాయి మీదగ్గరకే తిరిగి వచ్చినా సరే ఇరవై లక్షల రూపాయలు వాడి పేరు మీద ఇప్పుడే వేస్తాను. అది వాడి సొంతమే అవుతుంది. మీ గురించి కూడా ఆలోచించాము. మీరు బతికినంత కాలం పించను లాగా నెలకి పదివేలు ఇస్తాము. మీకు సమ్మతమైతే చెప్పండి" అన్నాడు.

"నా చిన్ని ఛార్లట్ ని మీకు అమ్మసుకోవాలా? ఒక తల్లిని అదిగే ప్రశ్నేనా ఇది? ఎంత దారుణం... ఎంత దారుణం?" అంటూ ఆవేశంగా అరిచింది కన్నతల్లి. ఆమె భర్త మాత్రం ఏదో ఆలొచిస్తున్నట్లు మాట్లాడకుండా వుండిపోయాడు కానీ, ఆమె చెప్తున్న విషయాన్ని సమ్మతిస్తున్నట్లు తలాడించాడు.

మేడమ్ హెన్రీ ఆ తిరస్కారానికి ఒక్కసారిగా ఆశ్చర్యపోయి కన్నీళ్ళు కార్చడం మొదలుపెట్టింది.

"
నేను చెప్పాను కదండీ. వాళ్ళు ఇవ్వరు. ఇవ్వరు..." అంటూ భర్తతో అంది. ఆమె గొంతు బాధతో పూడుకుపోయింది. హెన్రీ ఆఖరి ప్రయత్నం చేశాడు.

"ఆ పిల్లాడి భవిష్యత్తు గురించి ఆలోచించండి. వాడి సంతోషం కొసం..." ఆయనలా చెప్తుండగానే కోపంతో ముందుకు వచ్చి ఆ మాటల్ని మధ్యలోనే తుంచేసిందామె.

"
అన్నీ ఆలోచించాకనే చెప్తున్నాను. మాకు మొత్తం అర్థం అయ్యింది. అయ్యా, ఇంక మీరు పోయిరండి. మళ్ళీ ఈడ కనిపించకుండా వుంటే మంచిది. ఇట్టాగ పిల్లల్ని తీసుకెళ్ళిపోయ్యే ఆలొచన మానేస్తే మరీ మంచిది" అంది కటువుగా.

ముందు ఆవిడ తేరుకుంది. అదే వయసులో వుండే మరో పిల్లాడు వున్న సంగతి జ్ఞాపకం వచ్చిందామెకు.
“ఆ పిల్లాడు రెండో పిల్లాడు కూడా నీ కొడుకేనా” అని అడిగింది.

"కాదు. ఆ పిల్లాడు పక్కింటి వాలిన్స్ కొడుకు. మీకు కావాల్సింది వాడైతే వెళ్ళి వాళ్ళని అడగండి." టువచే అప్పుడు పలికాడు. ఆ మాట అంటూనే వెనక్కి తిరిగి కట్టెలు కొట్టేపనిలో నిమగ్నమైపోయాడు. ఒక్క ఉదుటున లేచి రూపవతి పక్కనే వున్న రెండో గుడిసెలోకి అడుగుపెట్టింది.

వాలిన్స్, అతని భార్య అప్పుడే కింద కూర్చోని వెన్న లేకుండా తయారు చేసుకున్న జొన్న రొట్టెలను తినబోతూ వున్నారు. ఈసారి హెన్రీ మాట్లాడాడు. ఇంతకు ముందు జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా, పదం పదం ఆలోచిస్తూ ఎంతో తెలివిగా మాట్లాడాడు.

భార్యాభర్త ఇద్దరూ ఆశ్చర్యపోయారు. ఆ ప్రతిపాదనని నిరాకరిస్తూ తల అడ్డంగా ఊపబొయారు. కానీ అంతలోనే నెలకి పదివేలు వచ్చి పడే మార్గం కనపడగానే ఆలోచనలో పడిపోయారు. ఒకరివైపు ఒకరు చూసుకోని కళ్ళతోనే సైగ చేసుకున్నారు. ఏం సమాధానం చెప్పాలో తెలియని సందిగ్ధంలో చాలా సేపు మిన్నకుండిపొయారు. చివరికి వాలిన్స్ భార్య అతని వైపు తిరిగి - "ఏమంటావయ్యా? ఇదేదో బాగానే వున్నట్టు వుందే..!!" అంది.

మేడమ్ హెన్రీ అదే అదనుగా పిల్లవాడి భవిష్యత్తు గురించి, వాడు అనుభవించబోయే రాజ భోగాల గురించి, వాడి పేరుమీద రాయబోయే ఆస్థిపాస్తుల గురించి ఏకరువు పెట్టింది.

"మరి నెల నెలా ఇస్తానన్న పదివేల రూపాయల పించను సంగతి వకీలుతో పత్రం రాయించి సంతకం పెడతారా?" అడిగాడు వాలిన్స్.

"తప్పకుండా... రేపటి నుంచే డబ్బు ఇచ్చే ఏర్పాటు కూడా చేస్తాను" అన్నాడు హెన్రీ. వాలిన్స్ భార్య ఏదో ఆలోచించుకుంది.

"నెలకి పదివేలు సరిపోవు. ఆ పిల్లాడే వుంటే మరో పదేళ్ళకైనా మా చేతికిందకి అక్కరకు వస్తాడు. వాడూ సంపాదిస్తాడు. అంచేత నెలకి పదిహేను వేలు ఇప్పించండి, ధర్మప్రెభువులు.." అంది ఆమె.

ఎప్పుడెప్పుడు పిల్లాణ్ణి తీసుకుదామా అని ఎదురు చూస్తున్న మేడమ్ హెన్రీ వెంటనే అంగీకరించింది. మరో పదివేలు బహుమతిగా అప్పుడే ఇచ్చేసింది. హెన్రీ పత్రం రాస్తుండగానే, ఆ పసివాణ్ణి ఎత్తుకోని తనతో బండి దగ్గరకు తీసుకుపోయింది. ఆ పిల్లాడు చిన్నగా ఏడ్చాడు కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఏదో పచారీ కొట్లో పళ్ళపొడి డబ్బా తీసుకున్నంత సుళువుగా వాణ్ణి తీసుకెళ్ళిపోయిందామె.

టువచే, అతని భార్య జరుగుతున్న ప్రహసనాన్ని తమ ఇంటి గుమ్మం ముందు నిలబడి చూశారు. బహుశా తాము చెయ్యలేని పని పక్కింటివారు చేశారని ఆశ్చర్యమో లేక తప్పు చేశామన్న భావనో వాళ్ళని కమ్మేసింది.

***

ఆ తరువాత చాలా రోజులపాటు వాలిన్స్ కొడుకు జీన్ వాలిన్స్ గురించి ఎవరికీ తెలియలేదు. వాడి తల్లిదండ్రి మాత్రం నెల నెలా హెన్రీగారి వకీలు దగ్గరకు వెళ్ళి తమకు రావాల్సిన పదిహేను వేలు తెచ్చుకునేవాళ్ళు. టువచే భార్య ఈ విషయాన్ని అందరికీ చెప్పి బుగ్గలు నొక్కుకుంది. పిల్లని అమ్మేసుకున్న వాలిన్స్ కుటుంబం అని పదిమందికీ చోద్యంగా చెప్పింది. అది అన్యాయమంది, ఘోరం అంది. ఆ నోట ఈ నోటీ ఈ విషయం పక్కింటిదాకా పాకింది. ఆ కారణంగా రెండు కుటుంబాల మధ్య తగాదాలు వచ్చాయి.

టువచే భార్య పిల్లాణ్ణి అమ్మకుండా వున్నందుకు తనని తాను అభినందించుకునేది. ఛార్లట్ ను ఎత్తుకోని ముద్దులుపెట్టి - "నేను నిన్ను అమ్ముకొలేదురా చిట్టికన్నా. డబ్బులేకపోతే లేకపోయె. నిన్ను మాత్రం అమ్ముకోలేదురా" అంటుండేది.

వాలిన్స్ కుటుంబం నెల నెలా అందే పించను వల్ల ఆర్థికంగా కస్త కుదుటపడ్డారు. బహుశా అందువల్ల కూడా టువచే కుటుంబం వారితో మాట్లాడటానికి ఇష్టపడటంలేదు. టువచే కుటుంబం మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు పేదవాళ్ళగానే మిగిలిపోయారు. ఛార్లెట్ తండ్రికి సహాయపడుతూ, అక్కలను చూసుకుంటూ ఇంటిపట్టునే వుండిపోయాడు.

ఛార్లెట్ కు ఇరవై ఒక్క సంవత్సరాలు వచ్చాక ఒకరోజు ఒక పెద్దకారు వచ్చి వాళ్ళ ఇంటిముందు ఆగింది. ఖరీదైన దుస్తులు వేసుకోని, బంగారు వాచీ పెట్టుకున్న ఒక యువకుడు ఆ కార్లోనుంచి దిగాడు. కారు రెండో వైపుకి వెళ్ళి తలుపుతీసి తెల్లటి రంగుతో మెరిసిపోతున్న ఒక వృద్దురాలికి ఆసరా ఇచ్చి దింపాడు. ఆమె దిగుతూనే అక్కడ వున్న రెండు ఇళ్ళ వైపు చూసింది.

"అదిగో నాయనా, అదే.. ఆ రెండో ఇల్లే" అని చెప్పిందామె. ఆ కుర్రవాడు సొంత ఇంటిలోకి ప్రవేశించినంత స్వతంత్రంగా ఆ ఇంట్లోకి అడుగుపెట్టాడు.

లోపల ముసలి తల్లి పాతగుడ్డలేవో ఉతుకుతోంది. ముసలి తండ్రి వాలిన్స్ పొయ్యి దగ్గర చలి కాచుకుంటూ జోగుతున్నాడు. ఇద్దరూ వచ్చిన వ్యక్తి ఎవరా అని ఆశ్చర్యంగా తల ఎత్తి చూశారు.

"
బాగున్నావా అమ్మా? బాగున్నావా నాన్నా?" అన్నాడా యువకుడు. ఇద్దరూ ఒక్కసారి అదిరిపడి లేచి నిలబడ్డారు. ఆమె చేతిలో సబ్బు నీళ్ళలో పడిపోయింది.

"నువ్వు... నువ్వేనా... నాబిడ్డవి నువ్వేనా? నా బిడ్డా?" అంది ఆమె ఖంగారులో తడబడుతూ.

ఆ కుర్రాడి ఆమెను కావలించుకొని "అవునమ్మా. నువ్వు బాగున్నావా?" అని మళ్ళీ అడిగాడు. ఆమె సమాధానం చెప్పే పరిస్థితిలో లేదు.

వాలిన్స్ మాత్రం వణుకుతూ దగ్గరకు వచ్చి "వచ్చేశావా జీన్?" అన్నాడు అక్కడికేదో పక్క వూరెళ్ళి వచ్చిన కొడుకుతో అన్నట్లు. ఆ తరువాత అందరితో పరిచయాలు చేశారు. చుట్టుపక్కల వున్న స్నేహితులందరి దగ్గరికీ తీసుకెళ్ళారు. వూర్లో పెద్దలకీ, బడిపంతులుకి, చర్చిలో పాస్టర్ గారికి తీసుకెళ్ళి చూపించారు.

పక్కింట్లో వుండే ఛార్లెట్ అతని కుటుంబంతో కలిసి ఆ రోజు రాత్రి తన ఇంటి గడప దగ్గర కూర్చోని భోజనం తింటూ వున్నాడు. సరిగ్గా అప్పుడే అటుగా నడిచి వెళ్తున్న వాలిన్స్ కొడుకుని చూశాడు.

"
మీకు పిచ్చి పట్టి నన్ను ఇవ్వనని అన్నారు" అన్నాడు తల్లిదండ్రితో. ఆ మాటకు బిత్తరపోయిన తల్లి - "నేను నిన్ను అమ్ముకోలేకపోయానురా" అంది. టువచే ఏమీ బదులు చెప్పలేదు.

"
ఓయబ్బో త్యాగం చేసింది మాయమ్మ... త్యాగం చేసి దరిద్రం మూటగట్టింది" అన్నాడు ఛార్లెట్. టువచే కు కోపం వచ్చింది.

"అయితే ఏమంటావురా. అప్పుడు మేము చేసినపనికి ఇప్పుడి నిలేస్తావా?" అన్నాడు

"అవును నిలేస్తాను. మీరట్టా తెలివితక్కువ పని చేశారు కాబట్టి నిలెయ్యాల్సిందే. మీ బోటి అయ్యాఅమ్మలు పిల్లలకి దరిద్రాన్ని రాసిస్తారు. మిమ్మల్ని ఇయ్యాలే వదిలేసి నాదారిన నే పోతా" అన్నాడు. ముసలి తల్లి తింటున్న కంచంలోనే కన్నీళ్ళు కార్చింది. బాధనీ, అన్నం ముద్దనీ ఒక్కసారే దిగమింగింది.

"నిన్ను పెంచడానికి మేము ఎంత కష్టపడినామో తెలుసునా బిడ్డా" అంది.

"ఏం లాభం? ఇలా బతకడానికే అయితే ఎందుకా కష్టం. ఇంతకన్నా నేను పుట్టకుండా చూసుకోకపోయారా? ఆ పక్కింటోణ్ణి చూశాక నా గుండె ఎట్టా కొట్టుకుంటోందో తెలుసా? నేను వుండాల్సిన చోట వున్నాడు వాడు. ఇక నా వల్ల కాదు. ఈడే వున్నానంటే రోజూ మిమల్ని ఇట్టాగే అనబుద్దేస్తుంది. మీరు చేసిన పనికి మిమల్ని ఎప్పటికీ క్షమించలేను. అసలు ఆ ఆలోచన కూడా చెయ్యలేను. నేను పోతున్నా" అన్నాడు.

ఇద్దరు ముసలివాళ్ళు నిశబ్దంగా కన్నీరు కర్చారు. ఛార్లెట్ తలుపు తీసుకోని వెళ్ళిపోయాడు. ఆ తెరుచుకున్న తలుపులో నుంచి ఏవో గొంతులు వినిపించాయి. పక్కింట్లో కొడుకు తిరిగివచ్చాడని వాలిన్స్ కుటుంబం చేస్తున్న హడావిడి అది.

ఫ్రెంచ్ మూలం: గి ద మొపాస
మూల కథ: ది అడాప్టెడ్ సన్

తెలుగు అనువాదం: అరిపిరాల సత్యప్రసాద్
(కౌముది అంతర్జాల పత్రిక మే 2013  సంచికలో ప్రచురితం)