చివరి కోరిక


పురాణం విశ్వనాధశాస్త్రి అంటే ఆ చుట్టుపక్కల పది పదేహేను వూర్లలో తెలియనివాళ్ళు లేరు. పురాణం ఆయన ఇంటిపేరు కాదు. ఆ పది పదిహేను గ్రామాల్లో జరిగే జాతర్లకి, సంబరాలకి, పండగలకి ఆయన పురాణం పెట్టించేవారు. ముఖ్యంగా చైత్రమాసం శ్రీరామనవమి పందిళ్ళలో సీతాకల్యాణం,  భాద్రపదంలో వినాయక నవరాత్రుళ్ళకి వినాయక విజయం, ఇక ఆశ్వీజమాసంలో దేవీనవరాత్రులకి దేవీ భాగవతం లాంటి పురాణపఠనం చెయ్యడం వల్ల ఆయన పేరుకు ముందు పురాణం వచ్చి చేరింది. మామూలుగా కాశీపురం అనే వూర్లో రామాలయంలో అర్చకత్వం నిర్వహిస్తూ వచ్చీపోయే భక్తులకు ధర్మసూక్ష్మాలు, జాతక వాస్తు విశేషాలు చెప్తుండాయన. సాయంత్రం అయ్యిందంటే చాలు అదే గుళ్ళో చిన్న అరుగులా వుంటే ప్రదేశంలో కూర్చిని భాగవతంలో పద్యాలో, భగవద్గీతలో పంక్తులో పాడుతూ వాటి గురించి విశ్లేషించేవారు.
ఆయన ఉపన్యాస ధోరణే కొంత విచిత్రంగా వుంటుంది. చెప్పేది ఎంతో లోతైన తాత్విక విషయమైనా చాలా సరళంగా ఎంతో విశదంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. ఆ ఊర్లో జరుగుతున్న భాగోతాలని భాగవత కథలతో ముడిపెట్టి చెప్పటంతో క్లిష్టమైన విషయాలను సైతం సులభంగా అర్థం చేసుకునేవాళ్ళు ఆయన శ్రోతలు.
ఒకరోజు గోపాల్రావు అనే పెద్దమనిషి సాయంసంధ్యవేళ వచ్చి దర్శనం చేసుకోని వెళ్ళబోతుండగా శాస్త్రిగారు ఆపారు.
“చిన్న కథ ఒకటి చెప్పాలనుకుంటున్నాను... వినిపోతావా గోపాల్రావు?” అన్నాడాయన.
“ఏంటి శాస్తుర్లుగారు... ఈ ఊరికి దేముడు తరువాత దేముడంతవోళ్ళు... మీరు సెప్తానంతే ఇనకుండా వుంటానా” అంటూ అక్కడే ఒక స్థంభానికి ఆనుకోని కూర్చున్నాడు గోపాల్రావు. శాస్త్రిగారు సావకాశంగా పూజలు అవీ కానిచ్చుకోని, వచ్చినవాళ్ళకి తీర్థం ఇవ్వడానికి చిన్న పంతుల్ని నిలబెట్టి తానూ వచ్చి గోపాల్రావు ముందు కూర్చున్నాడు. అప్పటికే రోజూ శాస్త్రిగారు చెప్పే కథలు వినడానికి వచ్చే నలుగురైదుగ్గురు కూడా వచ్చారు. శాస్త్రిగారు మొదలుపెట్టారు –
“కురుక్షేత్ర యుద్ధం జరిగే ముందు శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా వుండటానికి ఒప్పుకున్నాడు కదా? ఆ తరువాత ఒక రోజు యిద్ధం జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే అర్జునుడు యధాలాపంగా అలా అశ్వశాల వద్దకు వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తరువాత ఏం చూశాడో తెలుసా? సాక్షాత్తు పరమాత్ముడైన శ్రీకృష్ణుడు అక్కడ వున్న అర్జునుడి రధాశ్వాలను కడిగి శుభ్రం చేసి, వాటికి దాణా వేసి నెమ్మదిగా వాటి జూలును నెమరుతూ వాటిని ఉత్సాహపరుస్తున్నాడట. అది చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయి – ’అయ్యో బావా! నీకెందుకీ శ్రమ? నువ్వు ఎంతటివాడవు? ఈ పని చెయ్యాల్సిన అగత్యం ఏమొచ్చింది?’ అంటూ బాధపడ్డాడట. దానికి కృష్ణుడు నవ్వి – ’అర్జునా, నీ రథసారధ్యం వహిస్తానని ఒప్పుకున్నాను కదా? మరి అలాంటప్పుడు అశ్వసంరక్షణ బాధ్యత కూడా సారథిదే కదా? ఏ పనైనా ఒప్పుకున్నప్పుడు అది శ్రమ అయినా, నచ్చనిదైనా, ఇచ్చిన మాటకోసం నిర్వర్తించడం మన బాధ్యత. అందుకే ఇదంతా చేస్తున్నాను...’ అని చెప్పాడట ఆ మహానుభావుడు.” అంటూ గోపాల్రావు వైపు చూశారు శాస్త్రిగారు.
అప్పటికే విషయం అర్థమైన జనం ముసిముసి నవ్వులు నవ్వుతున్నారు. ఆ నవ్వుల వెనక అంతరార్థం అర్థం అయ్యి గోపాల్రావు మొహమాటంతో మెలికలు తిరిగి అక్కడ ఉండలేక లేచి వెళ్ళిపోయాడు. జనంలో కూర్చున్న ఒక ఆసామి గట్టిగా నవ్వి -
“భలేబాగా బుద్ది చెప్పారండీ... లేకపోతే ఉపసర్పంచ్ పదవైతే తీసుకున్నాడుకానీ, సర్పంచ్ పదవి రాలేదని అక్కసుతో ఒక్క పని చెయ్యడూ, ఇంకొకళ్ళని చెయ్యనివ్వడు... ఈ దెబ్బతో బుద్ధిరావాలి వాడికి” అన్నాడు.
శాస్త్రిగారు చిన్నగా నవ్వుతూ భాగవతం పుస్తకం తెరుస్తూ –
“మనం ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో అన్నీ పురాణాల ద్వారా కథల ద్వారా ఎప్పుడో చెప్పారు మన పూర్వికులు. ఆ చెప్పిన విషయాన్ని తెలుసుకోని అర్థం చేసుకుంటే మానవ జన్మ ఎత్తినందుకు ధన్యులం అవగలం...” అని ఆ నాటి పురాణం మొదలుపెట్టారు శాస్త్రిగారు.
***
శాస్త్రిగారికి ఇద్దరు మగపిల్లలని ఇచ్చి కాలం చేసింది ఆయన భార్య భూలక్ష్మి. పెద్దవాడు జనార్థన్, రెండొవవాడు అచ్యుత్. జనార్థన్ బాగా చదువుకున్నాడు. ఎల్.ఎల్.బి. చేసి హైదరాబాదులో లాయరుగా బాగా పేరు సంపాదించుకున్నాడు. బాగా కేసులు పెరిగిపోవటం మూలానేమో ఎప్పుడో ఒకసారిగానీ కాశీపురం వచ్చేవాడు కాదు. అలాగని తండ్రి మీద, తమ్ముడి మీద ప్రేమ లేదని కాదు. ఎప్పుడు వచ్చినా పట్నం రారమ్మని ఒకటే బలవంతం చేశేవాడు. శాస్త్రిగారు మాత్రం నవ్వేసి –
“ఈ ఊరిలో, ఈ గుడిలో నా బతుకంతా గడిచిందిరా... గుడిని దేవుణ్ణి వదిలిపెడితే, నేను ఈ కట్టెను వదిలిపెట్టినట్లే” అంటూ వారించేవాడు.
చిన్నవాడు అచ్యుత్ కి అంతగా చదువబ్బలేదు. తండ్రి దగ్గరే నాలుగు మంత్రాలు, చిన్న చిన్న పూజలు, పుణ్యఃవాచనం వంటివి నేర్చుకోని ఆ గుడి బాధ్యతలో తండ్రికి ఆసరాగా వుండేవాడు.
“పోనీ అన్నయ్యతో నువ్వు వెళ్ళు కొన్ని రోజులు వుండిరా నాన్నా... ఈ గుడీ అదీ నేను చూసుకుంటాను కదా. నువ్వు ప్రయాణం కట్టు” అంటూ తనూ ఒక మాట వేశాడు అచ్యుత్.
 “వయస్సు అయిపోయింది... ఇంక ప్రయాణం చేస్తే ఈ వైష్ణవాలయం నుంచి ఆ శైవక్షేత్రం శ్మశానానికే...” అంటూ నవ్వారు శాస్త్రిగారు.
ఆయన మాట నిజమే అయ్యింది. జనార్దన్ తిరిగి వెళ్ళిపోయిన నెల రోజులకే మంచానపడ్డాడు.
“మారకం నడుస్తోందిరా... ఈ పౌర్ణమి చూస్తానో లేదో... ఒక్కసారి పెద్దవాణ్ణి పిలిపించరా” అన్నాడు ఆయన అచ్యుత్ తో. అచ్యుత్ జనార్దన్ కి ఫోన్ చేశాడు కానీ జనార్దన్ రాలేనని చెప్పాడు. ఏదో పని వున్నందువల్ల మరో వారం దాకా రానని చెప్పాడు.
“వీలు చేసుకోని రారా... నీతో మాట్లాడేపని వుంది” అన్నారు శాస్త్రిగారు జనర్దన్ తో ఫోన్ లోనే.
“వీలు చేసుకుంటానులే నాన్నా” అన్నాడు జనార్దన్. అయితే మరో పదిరోజులు కదలలేని పరిస్థితి వచ్చింది అతనికి.
ఆ తరువాత మరో నాలుగు రోజులకి శాస్త్రిగారి మాట పడిపోయింది. మరో రెండు రోజుల తరువాత ఒక సాయంత్రం సంధ్యావందనం చేస్తున్న అచ్యుత్ ని ఆయన చప్పట్లు కొట్టి పిలిచి, తన భగవద్గీత పుస్తకం పెద్దవాడికి ఇవ్వమని చెప్పి కొడుకును తనదగ్గరే కూర్చోమని చెప్పాడు. అచ్యుత్ ఆయన పక్కనే మంచం మీద కూర్చోని తల నెమురుతూ ఉండగా ప్రశాంతంగా కోమాలోకి వెళ్ళిపోయారు. ఆయన పరిస్థితి అటో ఇటోగా వుందని అర్థం అయిపోయింది అచ్యుత్ కి. అక్కడ జనార్థన్ బయల్దేరానని ఫోన్ చేశాడు.
సరిగ్గా జనార్థన్ తండ్రి దగ్గరకు వచ్చి “నాన్నా” అని పిలుస్తుండగా ఆయన విన్నట్టుగా తలాడించారు. అంతే ఆ తరువాత ప్రాణం పొయింది. జనార్ధన్ ఏ మాత్రం చలించలేదు. ఒక్క నిముషం మౌనంగా కూర్చోని ఆ తరువాత ఏదో యజ్ఞానికి పూనుకున్నవాడిలా లేచి తమ్ముణ్ణి ఓదార్చాడు. బయట అంబులెన్స్ లో వున్న డాక్టర్ ను పిలిపించాడు. ఆయన, మరో ఇద్దరి సహాయంతో శాస్త్రిగారిని అంబులెన్స్ లోకి ఎక్కించారు. అప్పటికే విషయం తెలుసుకోని అక్కడికి చేరుకున్న ఊరి జనం అంతా ఆశ్చర్యంగా జరుగుతున్నది చూశారు.
“ఇంకా ఎందుకన్నయ్యా అంబులెన్సు? హాస్పిటల్సు? నాన్న ఇక లేడు కదా?” అన్నాడు అచ్యుత్ ఏడుస్తూనే.
“నాన్నని వైద్యానికి తీసుకెళ్ళటంలేదురా... ఆయన ఆఖరి కోరిక తీర్చడానికి తీసుకెళ్తున్నాను... మొన్న నాతో ఫోన్ లో మాట్లాడినప్పుడు నాన్న చెప్పారు... ఆయన చనిపోయిన తరువాత ఆయన శరీరంలో భాగాలను అవసరం అయినవారికి దానం చెయ్యమని...” చెప్పాడు జనార్థన్. ఆ విషయం వింటూనే భోరున ఏడ్చాడు అచ్యుత్.
బయట జనంలో కలకలం రేగింది.
“బాబూ... శాస్త్రులుగారంటే మాకు ఎంత గౌరవమో తమకి తెలియంది కాదు... అట్టాటిది ఆయనకి ఇట్టాటి గతి పట్టిస్తా వుంటే ఎట్టా వూరుకోమంటారు?” అన్నాడు ఆ వూరి పెద్ద.
“కొడుకుగా ఆయనకి వైద్యం చేయించడానికి అంబులెన్స్ తెచ్చావనుకున్నాం కానీ, ఇట్టా చేస్తావనుకోలేదయ్యా” అన్నదో ముసలామె.
“ఎంతో పవిత్రం బ్రతికిన మనిషాయన... ఆయన శరీరంలో భాగాలు తీసి ఎవరెవరికో పెడతామంటే మేం ఒప్పుకోం” అన్నాడు మరోకాయన. సరిగ్గా అప్పుడే తండ్రి పెద్దకొడుక్కి ఇమ్మని ఇచ్చిన భగవద్గీత తెచ్చి జనార్దన్ చేతిలో పెట్టాడు అచ్యుత్. అందులో నుంచి జారిపడిందో ఉత్తరం. దాన్ని ఆశ్చర్యంగా అందుకోని చదవడం మొదలుపెట్టాడు జనార్దన్.
“ప్రియమైన గ్రామ ప్రజలకు,
ఎక్కడో పుట్టి పొట్ట చేతబట్టుకోని ఈ వూరొచ్చిన నాకు ఇన్నాళ్ళుగా ఆసరాగా నిలిచిన ఈ ఊరికి, మీకు నేను ఎప్పటికీ రుణపడివుంటాను. ఈ రోజుతో నాటకంలో నా పాత్ర ముగిసిపోయింది. నా ఆఖరి కోరిక గురించి నా పెద్ద కొడుకు మీ అందరికీ చెప్పే వుంటాడు. అవును, నా శరీరభాగాలను దానం చెయ్యమని చెప్పింది నేనే. ఇప్పుడు వాడు నా కొడుకుగా నా కోరికి తీర్చడమనే కర్తవ్యపాలనే చేస్తున్నాడు. దయచేసి వాడికి అడ్డురాకండి.
నేను ఇక్కడ వున్నన్నాళ్ళు మీకు పురాణాల పేరుతో ఎన్నో కథలు చెప్పాను. మీరూ వాటినుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. కానీ కేవలం మీకు నేర్పించడమే కాదు, మీకు నేర్పించే క్రమంలో నేను ఏమి నేర్చుకున్నాను అనేది కూడా ఆలోచించాలి. మరి ఇన్ని కథలు చెప్పిన తరువాత నేను నేర్చుకున్నదేమిటి? ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని వేదాలు చదివినా అవన్నీ చెప్పేది ఒకటే – పరోపకారం ఇదం శరీరం. ఇప్పుడు నేను చేస్తున్నది అదే.
నన్ను చూడగానే మీరందరూ శాస్త్రిగారూ అంటారు. మీరు అలా పిలిచేది నా శరీరాన్నా? ఆత్మనా? శరీరాన్ని అయితే ఇప్పుడు ఆ శరీరం కేవలం ఒక కట్టె. శాస్త్రి అనే ఆత్మ ఆ పరమాత్ముడి సన్నిధిలో వుంది. శిధిలమైన శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోతుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినది మీకు అందరికీ చెప్పాను. అలా శిధిలమైన శరీరం మరికరికి పనికివస్తుందంటే అంతకన్నా కావల్సినది ఏముంది? నేను ఎప్పుడు పురాణం చెప్పినా, పది మందికి ఉపయోగపడే నీతి చెప్పినా పిట్టకథల ద్వారానే చెప్పాను. ఇప్పుడు నేను చేస్తున్నపని మీరు కథలా అందరికీ చెప్పండి. దానివల్ల నాలాంటివారు మరికొందరు తయారౌతారు. అదే మనం చెయ్యగలిగిన పరోపకారం. ఇక శలవు.
ఇట్లు
మీ శ్రేయోభిలాషి
పురాణం విశ్వనాధశాస్త్రి
ఉత్తరం చదవడం పూర్తిచేసి భగవద్గీతలో పెట్టాడు. అప్రయత్నంగా శాస్త్రిగారు ఎర్రరంగుతో గీతలు గీసి పెట్టుకున్న పంక్తులను చూసి వాటిని ఆర్తిగా తడుముతూ చదివాడు.
వాసాంసి జీర్ణాని యదా విహాయ; నవాని గృహ్ణాతి నరోపరాణి
తదా శరీరాణి విహాయ జీర్ణాని; అన్యాని సంయాతి నవాని థేహీ
జనం దారి వదలడంతో అంబులెన్స్ ముందుకు సాగిపోయింది. గుడిలో గంటలు మోగాయి.

<< ?>>
(జాగృతి - సంక్రాంతి ప్రత్యేక సంచిక 2013)

కథ చెప్తాను.. వింటావా?


ఎప్పుడూ లేనిది ఆ రోజు ఎందుకో బారు వైపు అడుగులేశాడు ప్రణవ్. సామాన్యంగా తోడు లేకుండా అతను ఒంటరిగా బారుకు వెళ్ళడం చాలా అరుదు. సరే వెళ్ళడం మాట అలా వుంచండి, అక్కడ అనుకోకుండా అతనికి సుజన్ కలవడమే విచిత్రం. సుజన్ కి, ప్రణవ్ కి చాలా కాలంగా స్నేహం వుంది. పైగా ప్రణవ్ రచయితగా పేరు పొందిన తరువాత సుజన్ అతనికి అభిమానిగా కూడా మారిపోయాడు.
“రేయ్ ప్రణవ్.. ఇట్రారా” అన్నాడు సుజన్ అతన్ని చూడగానే. ప్రణావ్ ముందు ఆశ్చర్యపోయినా తోడుగా మనిషి దొరికాడన్న సంతోషంతో సుజన్ దగ్గరకు వెళ్ళాడు.
“రా.. రా.. బేరర్... సార్ కి నాకు విస్కీ తీసుకురా” అంటూ అరిచాడు సుజన్. బేరర్ వరాలిచ్చే దేవుడిలాగా అడిగినవన్నీ అమర్చాడు. బయట చీకటిపడింది. ఇక్కడ బారులో మంది ఎక్కువ లేరు కాబట్టి మందు చిక్కబడింది. మత్తు తలకెక్కబడింది.
"నేను కూడా నీ లాగే కథలు రాద్దామనుకుంటున్నానురా.." సుజన్ అన్నాడు మత్తుగా.
"
ఏంట్రోయ్.. నీకు కూడా కథలు రాయాలనిపించింది.." నవ్వాడు ప్రణవ్ గమ్మత్తుగా.
"
చంపేస్తున్నాడురా వాడు..." సుజన్ అన్నాడు.
"
ఎవర్రా?" ప్రణవ్ చిరాకు.
"
ఇంకెవడు.. మా బాసు బోసుగాడు.."
“బాసులన్న తరువాత అంతమాత్రం ఇబ్బంది పెడతారు మరి. అది వాళ్ళ జన్మ హక్కు” అన్నాడు ప్రణవ్.
"అది కాదురా.. వాడి సాడిజం ఎక్కువైపోయింది... అందుకే వాడి గురించి ఒక కథ రాసిపడేయాలని నిర్ణయించుకున్నా”
"
బాగుంది... మంచి కథాంశం... బాగా రాసావంటే ఏదైనా కథల పోటీలో బహుమతి కూడా వస్తుండి.." భరొసా ఇచ్చాడు ప్రణవ్.
"
మరి కథ చెప్తాను వింటావా?"
"
కథలంటే ఎప్పుడైనా రెడీ చెప్పు... ఆగాగు.. ఇంకో పెగ్గు చెప్పి మొదలుపెట్టు" అన్నాడు ప్రణవ్. సుజన్ పెగ్గు చెప్పి గ్లాసులో వున్న కాస్త ద్రవం మింగి మొదలుపెట్టాడు.
"
ఉదయం ఏడుగంటలైంది...” ఒక్క క్షణం ఆగాడు.. “అలారం అదే పనిగా మోగుతోంది.."
"
ఆపరా.. ఆపు.."
"
ఏంటి అలారమా?"
"
కాదురా నీ కథ.."
"
ఏం? ఎందుకు?"
"
ప్రపంచంలో ఎన్ని కథలు ఇలా అలారం కొట్టడంతో మొదలయ్యాయి? నీ అలారం కొడితే నాకెందుకు, కొట్టకపోతే నాకెందుకు... డైరెక్ట్ గా కథలోకి రావాలి... వేరే రకంగా మొదలు పెట్టు"
"
సరే అయితే విను” అని ఒక్క క్షణం ఆలోచించి చెప్పాడు వాడు చచ్చిపడున్నాడు..."
"
బాగుంది... చాలా బాగుంది.. వాడు చచ్చిపడున్నాడు’... కొంచెం మిస్టరీ, సస్పెన్సుతో మొదలైంది... ఈ వాక్యం చదివారంటే పాఠకులు ఎవరు చచ్చాడు? ఎందుకు చచ్చాడు? అన్న కుతూహలంతో చదువుతారు.. కానీ తరవాత చెప్పు.." ఉత్సాహంగా అన్నాడు ప్రణవ్.
"
వాడు చచ్చిపడున్నాడు. వాడి శరీరం నిండా గాయాలు. బూటుతో తన్నినవి.. కర్రతో కొట్టినవి.. రాడ్డుతో బాదినవి.. మొత్తం రక్తం కారుతున్నాయి.."
"
నో.. నో.. నో... వాయలన్స్ వద్దు మనకి... ఇలా భీభత్స రసం పోషిస్తే ఎవరూ చదవడు... రక్తాలు, హత్యలు వద్దు మనకి.."
"
ఓకే... వాడు చచ్చిపడున్నాడు. చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు వుంది వాడి శవం. వాడు చేసిన తప్పులకి ఇలా చావాల్సిందే అని దేవుడు నిర్ణయించాడు. వాడే నా బాస్"
"
వాడు.. వాడు.. ఏంట్రా? వాడికో పేరు లేదా?"
"
వుండి.. బోసుబాబు"
"
అది మీ బాసు నిజం పేరు.. ఆయనకి తెలిస్తే చంపేస్తాడు. వేరే పేరేదైనా పెట్టుకో.."
"
ఏదో ఒకటి - సుబ్బారావో, పరంధామయ్యో.."
"
అదిగో అక్కడే దాల్ ఫ్రైలో కాలు వేశావ్... మన తెలుగు సాహిత్య చరిత్ర ప్రకారం పరంధామయ్య అంటే రిటైరైన మష్టారు. పంచె కట్టుకోని, చేతి కర్రతో, కళ్ళద్దాలతో ఎప్పుడు చూసినా గుండలమీద కుంపటిలా వున్న కూతుర్ని ఎవడో ఒకడి నెత్తిన మంటలా పెట్టాలని కాళ్ళు అరిగేలా తిరుగుతుంటాడు.."
"
అయితే సుబ్బారావు?"
"
సుబ్బారావంటే మధ్యతరగతి సంసారి. జీతానికి జీతానికి మధ్య ముప్ఫై రోజుల బ్రతుకు ఈడ్చే సామాజికుడు"
"
మరైతే పేరు బాగుంటుంది?"
"
ఆఫీసర్ అంటే కొంచెం మోడర్న్గా వుండాలి కదా?"
"
మరి బోసుబాబు అలా లేదుగా.."
"
అది వాస్తవం... కథలు మరీ అంత వాస్తవికంగా వుంటే కథ అచ్చు కాదు... కొంచెం ఆలోచించు.."
"
అయితే రంజిత్ అని పెట్టుకుందాం.."
"
ఫర్వాలేదు... బాగానే వుంది. ఇప్పుడు మళ్ళీ  మొదట్నుంచి చెప్పు"
"
రంజిత్ చచ్చిపడున్నాడు... చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు వుంది వాడి శవం. వాడు చేసిన తప్పులకి ఇలా చావాల్సిందే అని దేవుడు నిర్ణయించాడు. అసలు ఆ రంజిత్ గాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వెయ్యాలి కానీ భీబత్స రసం అవుతుందని చచ్చి శావంలా వుండిపొయాడు"
"
కథలో ఇలాగే వుంటుందా లేకపోతే నాకు చెప్తున్నావా?"
"
ఏమో తెలియదు నువ్వే చెప్పాలి... కానీ వాణ్ణి మాత్రం కాకులకి గద్దలకి వెయ్యాల్సిందే"
"
అది నీలో వున్న ఫ్రస్ట్రేషన్.. అలాంటివన్నీ పక్కన పెట్టి ప్రశాంతంగా కథ ఆలోచించాలి.."
"
వాణ్ణి తల్చుకుంటేనే వళ్ళు మండిపోతోంది.. ఇంక ప్రశాంతంగా ఎలా వుండగలనురా?"
"
అదే చిత్తప్రజ్ఞత అంటే... రచయతలకి అది చాలా అవసరం.."
"
సరే. అయితే విను. రంజిత్ చచ్చిపడున్నాడు... చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు వుంది వాడి శవం. వాడు చేసిన తప్పులకి ఇలా చావాల్సిందే అని దేవుడు నిర్ణయించాడు. శవం చుట్టూ జనం. అందరూ నవ్వుతున్నారు. కొంతమంది ముసిముసిగా నవ్వుతున్నారు. ఇంకొంతమంది విరగబడి నవ్వుతున్నారు. నేను కూడా నవ్వుతున్నాను. ఆనందంగా, సంతోషంగా నవ్వుతున్నాను. "
"
అదిగో మళ్ళీ సాడిజం వస్తొంది... శవం ముందు జనం నవ్వడం వరకు బాగానే వుంది. నీ నవ్వే కొంచెం ఓవరైంది.."
"
సరే తీసెయ్... స్వతంత్రంగా కథ చెప్పే అవకాశం ఇవ్వటంలేదు నువ్వు."
"
నీ పిచ్చిగాని కథలురాసేవాడికీ, కవితలు రాసేవాడికి స్వతంత్రం అనేది వుండదు.."
"
అయితే నన్ను కూడా మామూలుగా నవ్వమంటావు? సరే... తరువాత శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళి పాతిపెట్టారు..."
"
అప్పుడే స్మశానందాకా పొయ్యావే?"
"
ఏం చెయ్యమంటావు... శవాన్ని పెట్టుకోని భజన చేశాం అని రాయమంటావా?"
"
అంతేలే.. కానీ ఒకసారి శవాన్ని పాతి పెట్టాక ఇంక కథేముంటుంది?"
"
ఆలోచించనీ... ఆ... ఇది బాగుంది.. కుక్కలో నక్కలో వచ్చి వాడి శవాన్ని బయటికి లాగి..."
"
ఛీ.. ఛీ... హర్రర్ కథేమన్నా రాస్తున్నావా?"
"
మరి ఎలా... వాడు చచ్చినా నా కసి చావలేదు. ఏదోకటి చెయ్యాలి వాణ్ణి.."
"
అయితే ఒకపని చెయ్యి.. చాలావరకు కథల్లోలాగా మొదటి పేరా చివర్లో.. అతని శవాన్ని చూశాక నాకు గతం గుర్తుకొచ్చింది అని రాసి, మూడు నక్షత్రాలు పెట్టి వెనక్కి పో.. అక్కడ వాణ్ణి ఏదో ఒకటి చేసెయ్యి.."
"
ఇది బాగానే వుంది... కానీ ఏం చేస్తే బాగుంటుంది..?"
"
మొదట్నుంచి ఒకసారి చెప్పు... ఫ్లొ లొ ఏమన్నా వస్తుందేమో.."
"
సరే. అయితే విను. రంజిత్ చచ్చిపడున్నాడు... చాలా ప్రశాంతంగా నిద్రపోతున్నట్లు వుంది వాడి శవం. వాడు చేసిన తప్పులకి ఇలా చావాల్సిందే అని దేవుడు నిర్ణయించాడు. శవం చుట్టూ జనం. అందరూ నవ్వుతున్నారు. కొంతమంది ముసిముసిగా నవ్వుతున్నారు. ఇంకొంతమంది విరగబడి నవ్వుతున్నారు. శవాన్ని చూడగానే నాకు గతం గుర్తుకొచ్చింది. మూడు చుక్కలు. రంజిత్ 'నన్ను చంపద్దు... నన్ను చంపద్దూ అని అంటున్నాడు. నేను ఇనప బకిల్ వున్న బెల్టుతో పిచ్చ కొట్టుడు కొట్టాను..."
"
బాలేదు"
"
సరే పిచ్చ కొట్టుడు బాగాలేదంటే, వీర కొట్టుడు కొట్టాను అని రాద్దాం"
"
బాలేనిది అది కాదు... అసలు నువ్వు అతన్ని చచ్చేట్టు కొట్టడమే బాగలేదు... పైగా దానికి గతం అని ఫ్లాష్ బ్యాక్ ఒకటి.."
"
మరేం రాయాలి?"
"
అతని కుటుంబం గురించో, అమాయకమైన ముఖం గురించో, ఆఫీసులో అతను పడే కష్టం గురించో..."
"
రేయ్ ప్రణవ్.. బోసుబాబుకి సపోర్ట్గా మాట్లాడావో.."
"
బోసుబాబు కదురా... రంజిత్.. మన కథలో కారెక్టర్..."
"
కేరక్టర్ కాదు... నా బాసు బోసు బాబే... వాణ్ణే నేను చితక్కొట్టి చంపేశాను.. అదే కథ..."
"
అలాగైతే అది పత్రికల్లో అచ్చుకూడా కాదు... సొంట డబ్బుల్తో పుస్తకం అచ్చు వేయించుకునే రచయితలాగా తయారౌతుంది నీ బ్రతుకు."
"
భేతాళుడిలా డైలాగులు వెయ్యకు... నేను వాణ్ణి చంపుతున్నా అంతే అదే కథ. నువు వొద్దన్నావో నిన్ను ఇప్పుడే చంపుతా.." పక్కనే పడివున్న బీరు బాటిల్ ఎత్తాడు సుజన్. పైగా అప్పటికే బిల్లు టేబుల్ మీదకు వచ్చేసింది. కాదంటే బిల్లు కట్టాల్సివస్తుందని ప్రణవ్ కి అర్థం అయ్యింది.
"
ఇంట ప్రేమగా చెప్తే కాదంటానా? నీ ఇష్టం వచ్చినట్లు చెప్పు"
"
అయితే విను - రంజిత్ చచ్చిపడున్నాడు... వాడి వంటి నిండా గాయాలు. బూట్లతో తన్నినవి, కొరడాతో కొట్టినవి, రాడ్డుతో బాదినవి.
వాడి గాయాల నిండా రక్తం కారుతోంది. వాడు చేసిన తప్పులకి ఇలా చావాల్సిందే అని దేవుడు... కాదు కాదు నేనే నిర్ణయించాను. శవం చుట్టూ జనం. అందరూ నవ్వుతున్నారు. కొంతమండి ముసిముసిగా నవ్వుతున్నారు. ఇంకొంతమంది విరగబడి
నవ్వుతున్నారు. వాళ్ళాంతా ఆఫీసులో అతని కింద పనిచేసే వాళ్ళు. నేను కూడా విరగబడి నవ్వుతున్నాను. హ్హా.. సరిగ్గా అప్పుడే నాకు గతం గుర్తుకొచ్చింది. మూడు చుక్కలు. రంజిత్ 'నన్ను చంపద్దు... నన్ను చంపద్దూ అని అంటున్నాడు. నేను ఇనప బకిల్ వున్న బెల్టుతో పిచ్చ కొట్టుడు కొట్టాను. దెబ్బలకే వాడు చచ్చిపోయాడు. వాడి శవాన్ని స్మశానానికి తీసుకెళ్ళి
పాతిపెట్టారు. తరువాత నక్కలు వచ్చి వాణ్ణి పీక్కుతిన్నాయి. వాడు దయ్యమయ్యాడు..."
"
అదేంటి కొత్తగా?"
"
చెప్పేది విను - వాడు దయ్యమయ్యి మా ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. నాకు మేరేజిడేకి లీవ్ ఇవ్వడానికి ఏడ్చిన వాడికి ఇప్పుడు వాడి డెత్ డే రోజు వాడి సీట్లో కూర్చోని వున్న నేను కనిపించాను..."
"
అదేంట్రా? నీకు ప్రమోషనా? నీకన్నా ముందు రావాల్సినవాళ్ళు ఉన్నారు కదా?"
"
కథ రాస్తోంది ఎవరు?"
"
నువ్వే"
"
సో ప్రమోషన్ కూడా నా ఇష్టమే..."
"
సరే కానీ"
"
ఇంకేముంది ఆఫీసరుగా నన్ను చూసిన బోసుబాబుగాడి దయ్యం ఆత్మహత్య చేసుకుంది."
"
బోసుబాబు కాదు రంజిత్.."
"
రంజిత్ అని రాస్తే నాకు తృప్తి రావటంలేదు... బోసు బాబనే రాస్తాను"
"
అయినా చచ్చి దయ్యమైనవాడు మళ్ళీ ఆత్మహత్య చేసుకోవడమేంటిరా?"
"
నా ఇష్టం... ఆత్మహత్య కాకపోతే మళ్ళీ నేనే దయ్యాన్ని కూడా చంపానని రాస్తా..."
"
సరే నీ ఇష్టమే.. కాకపోతే ఒక చిన్న సజెషన్.."
"
చెప్పు -"
"
మన ప్రస్తూత తెలుగు సాహిత్య ధోరణులు చూసినట్లైతే.."
"
తెలుగులో చెప్పు"
"
ఏం లేదురా... ఇప్పుడొస్తున్న కథలు చూడు.. చివర్లో ఒక పాత్ర మరో పాత్రకి మూడు నాలుగు పేరగ్రాఫుల ఉపన్యాసం ఇవ్వాలి... అండుకే చివర్లో దయ్యాన్ని చూసి నువ్వు బాసుగాడికి చిన్న లెక్చర్ ఇచ్చినట్లు రాస్తే బాగుంటుంది."
"
లెక్చెర్ ఇవ్వాలా... చచ్చినొడు.. వాడికి లెక్చెర్ ఇచ్చేదేంటి... వాణ్ణి మళ్ళీ మళ్ళీ చంపాలి అంతే.."
"
సరే అలాక్కానీ... బారు మూసేస్తున్నారు వెళ్దామా?"
"
సరే పద... కానీ ముందు కథ ఎలా వుందో చెప్పు?"
“కథ సూపర్ రా...
“అవును... బోసుబాబుని చెంపేశా... అదే సూపర్...
“కరక్టే... చంపాల్సిందే వాణ్ణి”
"
అన్నొటొరే మర్చిపోయాను కాకులు గద్దలు వున్నాయని మొదట్లో చెప్పాను కదూ... అవి మర్చిపోయాను. మళ్ళీ మొదట్నుంచి మొదలుపెడతాను..."
అప్పటికే ఆలస్యమౌతోందని ఇద్దరిని బయటికి మోసుకొచ్చి పడేశారు బార్లో పని చేసేవారు. కథ బయట కూడా కొనసాగుతూనే వుంది. మర్నాడు ఆఫీసుకి వెళ్ళాలని వాళ్ళకి గుర్తుకొచ్చేదాకా సాగుతుందది.
అయితే సుజన్ కథ రాశాడా? ఆ కథని తెలుగు సాహితీలోకం నిండు హర్షంతో స్వీకరించిందా? నిబిడాశ్చర్యంతో చూసిందా? లేక నిర్దాక్షిణ్యంగా తిరస్కరించిందా? ఇవన్నీ ప్రస్తుతానికి శేషప్రశ్నలే.

<< ?>>
(కౌముది మాసపత్రిక, డిసెంబర్ 2012)