పుస్తకాల పిచ్చోడు (టాగ్: అది నేనే)

ఇండోరులో పుస్తక ప్రదర్శన

ఇలా పేపర్‌లో చూశానో లేదో ఎగిరి గంతేశాను. పైన ఫాను తగిలింది.

చిన్నప్పుడు సరుకులు తెమ్మని ఇంట్లో వాళ్ళు పంపితే, నేను ఎంతకీ రావట్లేదని నాకోసం వచ్చేవాళ్ళు. చూస్తే ఏముంది...!! మా సరుకుల షాపు వెంకటేశ్వర్లు తచ్చి పెట్టుకున్న పొట్లాలు కట్టే కాగితాలలో నచ్చినవి ఏరుకోని చదువుతుండేవాడిని. ఒక్కోసారి త్రాసులో కాగితం వేసి ఏ పంచదారో శనగలో వంపుతుంటే "ఆగాగు" అని ఆ కాగితం లాక్కొని "వేరే కాగితం వేసుకో.. ఇందులో నేను చదవాల్సిన విషయం వుంది" అనేవాణ్ణి. మరోసారి నా మాట వినకుండా మా వెంకటేశ్వర్లు శనగలు వంపేసేవాడు. నేను వూరుకుంటానా - ఇంటికి వెళ్ళగానే ఆ పొట్లం విప్పి శనగలు డబ్బాలో పోసేదాకా పేచీ పెట్టి, అప్పుడు కాగితాన్ని జాగర్తగా మడతలు పొయ్యేట్టు సాపు చేసి చదువుకునేవాణ్ణి. ఇప్పటికీ ఎక్కడైనా పుస్తకం కనపడితే ఆగిపోతానని నా శ్రీమతి అంటుంటుంది.

ఏం చేస్తాం చెప్పండి? అది నా బలహీనత. నచ్చిన పుస్తకం కనపడితే వెనకాముందు చూడకుండా కొనెయ్యటం మరో బలహీనత. ఈ మధ్య పని వత్తిళ్ళు ఎక్కువగా వుండటం, మా అమ్మాయి దోగాడే వయసు నించి అడుగులేసి పుస్తకాల రాకు అందుకునే వయసుకి రావటంతో పుస్తకాలు చదవటం కొంతవరకు తగ్గింది. పుస్తకాలు చదవటం తగ్గిందేకాని బ్లాగుల పుణ్యమాని చదవటం మాత్రం తగ్గలేదు.. అలాగే పుస్తకాలు చదవటంలేదు కదా అని కొనటం మాత్రం తగ్గిస్తామా... అందుకే అంత ఆనందం.


ఆంధ్రప్రదేశ్‌లో వున్నప్పుడు హైదరాబాదులో జరిగినా విజయవాడలో జరిగినా నేను ఖచ్చితంగా వెళ్ళేవాడిని. గత కొంతకాలంగా వేరే రాష్ట్రాలలో వుండటం వల్ల ఇలాంటి ప్రదర్శన చూసి చాలా కాలమైంది. సరే, ఈ రోజు ఆఫీసు మధ్యాహ్నం ఒంటిగంట దాకే కావటంతో వెంటనే అక్కడికి వెళ్ళాలని నిర్ణయించేసుకున్నాను. కార్పొరేట్ వుద్యోగం.. పైగా మాసాంతం..!! అంత సులువుగా బయటపడగలనా? అప్పటికీ మూడు గంటలకి బయటపడ్డాను. అప్పటికింకా భోజనం చెయ్యలేదు. "ఒక పూట భోజనం లేకపోయినా ఫర్లేదు ఒక పుస్తకం కొనుక్కోమన్నారు పెద్దలు" అని నాకు నేనే చెప్పుకొని ఆటో ఎక్కాను.


"ముందు పుస్తకాలకి బడ్జెట్ ఎంతో అనుకోవాలి. లేకపోతే ఎడా పెడా కొని తర్వాత బాధపడాలి" అనుకోని, "ఎమైనా సరే వెయ్యి రూపాయల నించి రెండు వేలు లోపలే కొనాలి" అని తీర్మానించి, ఎందుకైనా మంచిదని ఏటీయంలో నాలుగువేలు డ్రా చేసాను.


ప్రదర్శన జరిగే గాంధీ భవన్ చేరుకోని ఒక టీ కొట్టి లోపలకి వెళ్ళబోతే గేటు దగ్గర "టికెట్టు ??" అన్నారు.

"హవ్వ... హవ్వ ఎంత చోద్యం... ఈ వింత నేనెక్కడా ఎరగనమ్మా..!! పుస్తకాలేమైనా తోలుబొమ్మలాటా?? టికెట్టు కొనుక్కోని చూసిపోడానికి?" అనుకున్నాను కానీ కొనక తప్పింది కాదు.

లోపలికి వెళ్ళాక నాకు మొదటి నిరుత్సాహం మొదలైంది. పట్టుమని ఇరవై స్టాళ్ళైనా లేవు. అందులో నాలుగు ఫెంగ్‌షూయీ స్టాళ్ళు, ఒకటి చిన్న పిల్లల బొమ్మల స్టాలు, రెండు తినుబండారాల స్టాళ్ళు.

కడుపులో ఆకలి కాలింగ్ బెల్లు కొట్టి -


"రేయ్ పుస్తకాల పిచ్చోడా.. ఇప్పటికైనా నా మాట విని ఏమైనా తిని తగలడు. ఆ తరువాత వున్న వాటిల్లో ఏ ముగ్గుల పుస్తకమో కొనుక్కోని ఇంటికి పో" అని అరిచింది. అంతలో మిణుకు మిణుకుమంటూ ఒక ఆశాదీపం వెలిగింది. ఒక స్టాలు దగ్గర ఒకటే జనం. పాంటు పైకి లాక్కొని పరుగెత్తుకెళ్ళాను.

హిందీ పుస్తకాలు..!! నేను హిందీ చదవగలను కానీ హిందీ పుస్తకాలు ఆఖరుగా చదివింది పదో తరగతిలో అనుకుంటా.

"లేకపోతే తెలుగు పుస్తకాలు దొరుకుతాయనుకున్నావా..." కడుపులోంచి వినపడింది.

ఆ పక్కన కొంచెం చిన్న స్టాలు. పల్చగా జనం. వెళ్ళి తొంగి చూశాను.

పుస్తకాలన్నీ నేలమీద గుమ్మరించి వున్నాయి. జనాలు వాటిల్లోంచి ఏరుకుంటున్నారు. "ఇదేమైనా కొత్త స్కీమా?" అడిగా స్టాలు ఓనర్ని.

"ఏ పుస్తకమైనా ఇరవై రూపాయాలు" అన్నాడు వాడు. నాకు ఏదో సినిమాలో శ్రీ కృష్ణుడి విశ్వరూపం చూపించేటప్పుడు వినిపించే ఫ్లూట్ వినపడింది. ఆ షాపు వోనరు నలభై చేతులతో ఒక్కొక్క చేతిలో పదేసి పుస్తకాలతో కనిపించాడు. నేను కళ్ళ నీళ్ళు తుడుచుకొని - "ఈ షాపు మొత్తం ఎంతకి అమ్ముతావు" అని అడగబోయి.. ఎందుకులే మనకి కావల్సినవి ఏరుకుందామని పుస్తకాల మీద పడ్డాను.

అన్నీ ఇంగ్లీషు పుస్తకాలే..!
అన్నీ ఫారిన్ ఎడిషన్లే..!!

అయితే అందులో ఏవీ పేరుపడ్డ పుస్తకలేమీ కాదు. ఠాఠ్..!! ఏమైతేనేమి పుస్తకాలే కదా..!! పేరున్న రచయితల అంతగా పేరుపడని పుస్తకాలు, ఇదుగో ఇది ఫలానా ఫలనా అవార్డు పొందిన పుస్తకం, ఈ పబ్లిషర్ మంచి పుస్తకాలు వేస్తాడు.. ఈ రకంగా ఏరుకున్నాను. ఏరుకుంటూ ఆ పుస్తకాల గుట్ట చుట్టూ నాలుగు ప్రదక్షిణాలు చేసాను. ఏరుకున్న పుస్తకాలని పట్టుకునేందుకు చేతులు చాలట్లేదు. అంతలో అడుగున ఒక పుస్తకం ఎర్రట్ట తళుక్కున మెరిసింది - టక్కున గుట్ట మీద పడిపోయి సర్రున లాగాను. దాన్ని పట్టుకొని దానితో పాటే ఒక పిల్లాడు బయటకి వచ్చాడు.

"నీ దుంపతెగ నువ్వెట్టా వచ్చావురా..??" అంటే

"చాల్లే సంబడం నాలాంటి సాహిత్యాభిమానులు రెండురోజుల్నించి లోపలే మకాం... పుస్తకాలు ఏరుకుంటున్నాం" అన్నాడు.

"బాగానే వుంది సంబడం" అనుకోని నేను ఏరిన పుస్తకాలలో కొన్ని "తీసి" "వేసి" ఒక ఇరవైదాకా తెచ్చుకున్నాను. మొత్తం ఖర్చు: నాలుగు వందల యాభై అయిదు. అప్పటికే ఆకలిగాడు అడ్రస్ లేకుండా పోయాడు. వాణ్ణి వెతికి పట్టుకొని భోజనం చేయిస్తూ అన్ని పుస్తకాల అట్టల్ని నమిలేశాను. ఇక పేజీల వంతు..!!

అనామక భావుకులు (కవిత)

భావుకత్వం పాఠం కాదు

బడిలో చేరి నేర్చుకోవటానికి

స్పందన ఒక చర్య కాదు

శిక్షణతో అబ్బటానికి



నీ పక్కనే కూర్చుని

నువ్వు చూసేదే చూసి

నీకు తెలియని లోతుల్ని కొలిచేవాళ్ళు

నీ వూహకి దూరంలో వుంటారు



అక్షరం వ్రాయలేకపోయినా

లక్షల భావాలని ప్రకటించే

పలుకులమ్మ బిడ్డలు

నీ కంటి చూపుకి అవతల వుంటారు



ఏదో ఒక హోటల్లో

నీ ఎంగిలి పళ్ళెం కడుగుతుంటే

ఒక "నటరాజన్" చేతులకి

"శారదా" కటాక్షం కలగొచ్చు



నువ్వెక్కిన ఆటో మోతలో

సప్త స్వరాలు వినగల్గిన డ్రైవరు

ఆగిన ప్రతి ట్రాఫిక్ జాంలో

కథలల్లే కానిష్టేబులు



ఎంతో మంది భావుకులు

నీ చుట్టే వున్నా నీ కన్నే తెరుచుకోదు

భావుకత్వాన్ని కులానికో సంపదకో

బలవంతంగా అతికిస్తూ కళ్ళు మూసుకుంటావు



నీ కులమో నీ డబ్బో నిన్ను మహాకవిని చేస్తే

రొమ్ము విరుచుకోకు

పక్షపాతం లక్ష్మీదేవిదే కాని

చదువులమ్మది కాదుగా



("ఒక భావుకుడి ఆటోలోనించి రెండు కవితలు " అనే నా టపాకి స్పందించిన బొల్లోజు బాబాగారు, సుజాతగారు, అరుణగారు వ్రాసిన వ్యాఖ్యల స్పూర్తితో)

ఒక భావుకుడి ఆటోలోనించి రెండు కవితలు

మొన్నా మధ్య ఇండోరులో ఒక ఆటో ఎక్కాను. డ్రైవర్ సీటుకి వెనక భాగంలో హిందీలో ఏదో వ్రాసి వుండటం చూశాను. ఏదో అల్లరి రాతలై వుంటాయని అట్టే పట్టించుకోలేదు. దారిలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆటో ఆగితే చదవటం మొదలెట్టాను. షాయరీ..!! అందులో రెండు కవితలు వాటికి నా స్వేచ్చానువాదం:

1. మన్ తెరా సచ్చా తో కిస్మత్ తేరీ రాశీ
కిస్మంత్ తేరీ అచ్చీ తో ఘర్ మే మథురా కాశీ

తెలుగు: మంచిదైన మనసు నీదైతే
సొంతమౌను అదృష్టాల రాశి
ఆ అదృష్టం సొంతమైతే
నీ ఇల్లే మథుర కాశి

2. పానీ పానీ సబ్ మాంగే గంగా జల్ కుచ్ ఔర్ హై
సవారీ సబ్ ఆతీ హై ఆప్కా ఆనా కుచ్ ఔర్ హై

తెలుగు: నీళ్ళు నీళ్ళనే అంతా అడిగేరు కానీ
అందులో గంగా జలమే వేరులే
ప్రయాణికులు ఎందరో వచ్చేరు కానీ
మీ రాక ప్రత్యేకతే వేరులే

ఆటో దిగుతూనే అడిగాను ఎవరు వ్రాశారని.

"నేనే వ్రాశాను సార్.. ఎప్పుడో ఆటో కొన్న కొత్తల్లో రాట్రిపూట వ్రాశాను... అందుకే చేతి వ్రాత సరిగా లేదు.."

"అయితే నువ్వు కవిత్వాలు కూడా వ్రాస్తావా..??"

అతను సమాధానం చెప్పలేదు. ఒక చిరునవ్వు నవ్వి ఆటో స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు.

ఆ నవ్వు - "ఏం ఆటో నడుపుకుంటే కవిత్వం వ్రాయకూడదా" అని అడిగినట్టు నాకెందుకనిపించింది??

మిల్కీబార్ (కథ)

అప్పారావుకొక చిన్న కోరిక - ఒక విచిత్రమైన కోరిక..

"మిల్కీబార్ చాక్లెట్ కొనుక్కోని తినాలి" అని.

ఆ కోరిక కలగటం కూడా అనుకోని విధంగా జరిగింది. నాలుగు రోజుల క్రితం ఒక రోజు అప్పారావు చిన్న కూతురు శైలు స్కూల్‌నుంచి వస్తూనే అరవటం మొదలుపెట్టింది -

"నాన్న.. నాన్నా నాకు మా టీచరు చాక్లెట్ ఇచ్చింది.. మామూలుది కాదు మి-ల్కీ-బా-ర్" అంది తమాషాగా కళ్ళు తిప్పుతూ.

"ఎందుకిచ్చారమ్మా?" అడిగాడు అప్పారావు పాపని ముద్దుపెట్టుకుంటూ.

"నేను క్లాసులో ఫస్టొచ్చాను నాన్నా.. అందుకే.." అంది గర్వంగా

"నా బంగారు తల్లి.." మళ్ళీ ముద్దుపెట్టుకొని అన్నాడు-

"అందరికీ పంచి పెట్టి నువ్వు కూడా తిను.." ఆ మాట వింటూనే లోపలికి పరుగుతీసింది పాప.

ఆ తరువాత అప్పారావు సరుకులు తీసుకు రావాలని బయటికి వెళ్ళాడు. అక్కడ కనిపించిన స్నేహితులతో కాస్సేపు పిచ్చాపాటి మాట్లాడి ఇంటికొచ్చే సరికి కొంచెం ఆలస్యమైంది. పిల్లలు టీవీ చూస్తున్నారు. అతను రావడం చూడగానే పరుగున వచ్చి కరుచుకుంది శైలు.

"నాన్నా నాన్నా మిల్కీబార్ భలే వుంది నాన్నా.." అంది పాప.

"మరి నాకేదమ్మా.." అడిగాడు సరదాగా.

"లేదు నాన్నా అయిపోయింది... అక్క, అన్నయ్యా, నేను, అమ్మ తినేసరికి అయిపోయింది.." అంది చేతులు తిప్పుతూ. అప్పారావు నవ్వి వూరుకున్నాడు.

"నాన్నా నువ్వు తినలేదుగాని భలే వుందిలే" అన్నాడు కొదుకు రవి టీవీ చూస్తూనే.

"సరేలేరా..!" కాస్తంత చిరాకు ప్రదర్శించాడు.

"అది నిజంగా పాలతో చేసినట్టున్నారు. ఇంత ముక్కే వచ్చింది పంచుకుంటే.. ఒక పక్కకి కూడారాలేదు." అంది పెద్ద కూతురు శ్రావణి మంచి నీళ్ళందిస్తూ. "అసలు నీకోసం కూడా వుంచాం నాన్నా.. చిన్నది వాడు కలిసి చెప్పాపెట్టకుండా లాగించేశారు.." అంది మళ్ళీ.

"సరేలే అదేమన్నా అమృతమా .. ఇంక వూరుకో.. !!" అన్నాడు వంటింట్లోకి వెళ్తూ.

రాత్రి భోజనాలయ్యాక మంచం వాల్చి, దిండు, దుప్పటి వేసుకున్నాడు. ఇక పడుకోవడానికి సిద్దమౌతుండగా భార్య ప్రమీల వచ్చింది. "ఈ రోజు ఏ సీరియల్లో ఏ హీరోగారి రెండో పెళ్ళాం మూడో ప్రియుడి గురించి చెప్తుందో" అనుకున్నాడు అప్పారావ్. అయినా తప్పదుకదా.. ఏమిటన్నట్లు చూసాడు.

"ఏంలేదు.. పిల్లలు బావుందంటున్నారు కదా ఎప్పుడైనా కొని తెద్దురూ" అందామె.

"ఏంటది" యధాలాపంగా అడిగాడు.

"అదేనండి ఆ మిల్కీబార్"

"ఇదేమిటే ముఖ్యమంత్రి ప్రచారంకోసం పుట్టిన దినపత్రికలాగ అందరూ ఒకటే విషయం చెప్తున్నారు.. ఇంకేం విషయాలు లేవా.?" కాస్త కోపంగానే అన్నాడు.

"లేదు... ఇదేం ప్రచారంకాదు.. నిజంగానే బాగుంది. నాకే ఇంకొంచెం తినాలనిపిస్తుంటే.. అబ్బ నోట్లో వేసుకోగానే కరిగిపోయింది. మీరూ తినుండాల్సింది.." అంటూ పడుకుంది ప్రమీల.

అంతే అక్కడ పడింది బీజం.. తనూ మిల్కీబార్ తినాలి అని. ఆ తరువాత అది దేశంలో అవినీతి పెరిగినట్టు పెరిగి పెద్ద చెట్టై కూర్చుంది. రెండురోజుల్లో మిల్కీబార్ తినాల్సిందే అని నిర్ణయించుకున్నాడు అప్పారావ్. కానీ నెలాఖరు...!! జేబులో యాభై రూపాయలున్నాయి..!! జేబులో యాభైరూపాయల నోటు తీసి ఒకసారి తెరిపార చూసుకున్నాడు. "ఆ మిల్కీబార్ ఎంతుంటుందో అయిదో..? పదో..? ఆ కాస్తా అయిపోతే... అమ్మో ఇంకా వారం రోజులు గడవాలి." ఆలోచిస్తూ పడుకున్నాడు.

మర్నాడు స్నానం చేస్తుండగా మళ్ళీ గుర్తొచ్చింది. మిల్కీబార్.. మిల్కీబార్.. అతని గుండె గొడవ చేస్తోంది. ఆఫీసుకు వెళ్తూ వెళ్తూ ఇంటి దగ్గరే వున్న ఒక జెనరల్ స్టోర్‌కి వెళ్ళాడు.

"ఏం కావాలండీ..?" అడిగాడు ఆ కొట్టువాడు. అప్పారావు ఇంకా సంశయిస్తూనే వున్నాడు.

"మి-ల్కీ-బా-ర్" అస్పష్టంగా గొణిగాడు.

"ఏమిటి సార్"

"మిల్కీబార్" కొంచెం గొంతు పెంచాడు.

"మిల్కీబార్ లేద్సార్.. పోనీ డైరీమిల్క్ ఇవ్వనా.." అన్నాడతను. అప్పారావు మనసొప్పుకోలేదు.

"ఊహు.. మిల్కీబారే.." అంటుండగా ఆ షాపులో అతను అందుకున్నాడు.

"ఇదీ అదీ ఒకటె రకం సార్... పిల్లలు ఇదే ఎక్కువ తింటారు.." కొంచెం తెలివి వుపయోగించాననుకున్నాడు కొట్టువాడు.

"పిల్లలికి కాదురా.. నాకే కావాలి" అందామనుకున్నాడు, మొహమాటమేసింది.

"మిల్కీబార్ లేకపోతే ఇంకేమీ వద్దులే" అంటూ బయటకు రాబోయాడు. అంతలోనే ఆగి -

"ఎంతుంటుందేమిటి..?"

"మిల్కీబారైతే ఇరవైసార్.. ఇదైతే పది రూపాయలే"

గుండెల్లో బాంబు పడ్డట్టైంది అప్పారావుకి. "ఇరవై రూపాయలా.. ఇరవై.. ఇరవై రూపాయలుంటే ఒక రోజు ఇల్లు గడిచిపోతుంది.. అంత డబ్బు ఒక చాక్లెట్ కోసమా.. వద్దులే" అనుకుంటూ పక్కన బేకరీలో మిల్కీబార్ అద్దాల పెట్టెల్లో కనిపించినా ఆగలేదు.

ఆ రోజు అలాగే గడిచిపోయింది. యాభై రూపాయల నోటు రెండు ఇరవై రూపాయలైంది. మిల్కీబార్ తినాలన్న కోరిక మాత్రం రెండింతలైంది. ఆ రోజంతా డబ్బుకి కోరికకి యుద్ధం జరుగుతునే వుంది. ఆ రాత్రి డబ్బుని కోరిక జయించింది.

"రేపు ఎలాగైనా కొనుక్కొని తింటాను" అనుకొని పడుకున్నాడు అప్పారావు.

నిద్రలేవగానే ఆఫీసుకి తయారయ్యి వెళ్తూ వెళ్తూ మధ్యలో బేకరీ ముందు ఆగాడు. ఒక సారి జేబు తడుముకునాడు. షాపు వాడు అప్పుడే సీసాలు సర్దుకుంటూ దేవుడి పటాలకు పూజ చేసుకుంటున్నాడు.

"పొద్దున్నే బేకరిలో మిల్కీబార్ కొనుక్కు తింటే చూసేవాళ్ళకి బాగుండదేమో" అనిపించింది. సాయంత్రం తీసుకోవచ్చు అనుకొని ఆఫీసుకు వెళ్ళిపోయడు. ఆఫీసులో క్షణమొక యుగమైపోయింది. ఏం పని చేస్తున్నాడో, ఎందుకలా ఆలోచిస్తున్నాడో అర్థం కావట్లేదు.

"ఏమోయ్ ఏమిటివాళ క్యారేజి" అడిగాడు పక్క సీటు కామేశం.

"మిల్కీబార్" అని నాలిక కరుచుకొని "మునక్కాయ్ పులుసు" చెప్పాడు.

సాయంత్రమైంది. ఎన్నడూ లేనిది ఆ రోజు అయిదు గంటలకే ఆఫీసు నుంచి బయలుదేరాడు. పరుగులాంటి నడకతో బేకరీ చేరుకొని "మిల్కీబార్" అన్నాడు. అతను ఇరవై రూపాయలు తీసుకొని ఇచ్చాడు.

అప్పారావు చేతిలో మిల్కీబార్. దాని పైన వున్న కాగితాన్ని నెమ్మదిగా తడిమాడు. చివరలు పట్టుకొని చించబోయాడు. అప్పటికే అక్కడ చాలామంది కాలేజీ పిల్లలు వున్నారు. వాళ్ళ ముందు తన వయసువాడు మిల్కీబార్ తింటే బాగుండదేమో అనిపించింది అప్పారావుకి. మిల్కీబార్ జేబులో వేసుకొని బయటపడ్డాడు. కానీ ఎక్కడ తినగలడు. చూసే వాళ్ళు తన వయసు గమనించి గేలి చేస్తే? అయినా ఎంత మంది తినడంలేదు? మిగతావాళ్ళ సంగతేమో కాని తన మనసు వొప్పడం లేదు... అటు ఇటూ వూగిసలాడుతోంది.

చివరికి దగ్గరలో వున్న ఒక చిన్న పార్కులో చేరాడు. అక్కడైతే ఎవరూ చూడరని అనుకున్నాడు. కానీ సరిగ్గా చాక్లెట్ కవర్ చించబోతుంటే వచ్చాడు - శనక్కాయలు అమ్మే ఒక చిన్న పిల్లాడు.

"సార్ శెనక్కాయలు కావాలా?"

"వద్దురా నువ్వు పో"

"తీసుకోండి సార్ బాగుంటాయి.."

"వద్దన్నానా.??"

"వేడిగా వున్నాయి సార్.. వుడకబెట్టినవి.."

అప్పారావుకి విసుగొచ్చేసింది. అతనికి తెలుసు - వాడి దగ్గర కొనకపోతే వదలడని.

"సరే ఒక రూపాయికి ఇవ్వరా" అంటూ మిల్కీబార్ పక్కన పెట్టి ఒక రూపాయి ఇచ్చి శనక్కాయలు తీసుకున్నాడు. శనక్కాయలవాడు కనుమరుగవగానే మిల్కీబార్ అందుకోబోయాడు. -

మిల్కీబార్ అక్కడ లేదు..

మిల్కీబార్ పోయింది...

ఇరవై రూపాయలు.. మిల్కీబార్.. తిన్నదిలేదు కనీసం రుచి ఐనా చూడలేదు. అప్పారావు ఆ చుట్టుపక్కలంతా పిచ్చిగా వెతికాడు. ఎక్కడా లేదు. శనక్కాయలోడు కనిపించలేదు.. అప్పారావు ప్రాణం వుసూరంది. కళ్ళలో నీళ్ళు వచ్చినంత పనైంది. ఒక అరగంటపాటు ఆ ప్రాంతమంతా కలియ తిరిగాడు. ఏ ప్రయోజనం లేకపోయింది.

కాళ్ళీడ్చుకుంటూ ఇల్లు చేరాడు. ప్రమీల మంచి నీళ్ళు, కాఫి తెచ్చిచ్చింది.

అవి తాగి తలపై చెయ్యి పెట్టుకొని కూర్చున్నాడు.

"ఏమండీ.." అంది ప్రమీల

"ఏమిటే.." విసుగ్గా అన్నాడు అప్పారావ్

"ఒక విషయం చెప్తా.. ఏమనకూడదు.."

"చెప్పు"

"నేను ఈ రోజు.. మిల్కీబార్ కొన్నాను" చెప్పిందామె.

"ఏమిటి మిల్కీబార్... డబ్బులెక్కడివి" అడిగాడు అనుమానంగా.

"నాకెక్కడివి.. మీ జేబులో నించే వుదయం తీసుకున్నా. ఇంకో ఇరవై వుందిగా అని తీసుకున్నా" అంటూ ఆమె చెప్తుంటే బాంబు పడ్డట్టైంది. వుదయం నించి మిల్కీబార్ కొనే హడావిడిలో గమనించలేదు.. జేబులో రెండు ఇరవై రూపాయలకి బదులు ఒకటే వుంది. అంటే చేతిలో వున్న నలభై రూపాయలు అయిపోయాయన్న మాట. కోపం, బాధ, నిస్సహాయత కలిసిపోయి ముఖంలో కనపడుతోంది. అతను తేరుకునేలోగా ప్రమీల -

"వుండండి మీకు వుంచాను.. తెస్తాను.." అంటూ బుల్లెట్లా దూసుకొని ఇంట్లోకి వెళ్ళింది.

అప్పారావుకి ఏమి తోచలేదు. చేతిలో వున్న నలభై రూపాయలు అయిపోయినందుకు బాధపడాలా తన కోరిక తీరుతున్నందుకు సంతోషించాలా? లోపలినించి ప్రమీల గొంతు వినపడింది -

"శ్రావణీ.. ఇక్కడ నాన్న కోసం మిల్కీబార్ పెట్టాను.. ఎవర్రా దొంగతనంగా తినేసింది..?"

అప్పారావు మళ్ళీ తల పట్టుకున్నాడు. అప్పటికే అతని బుర్రలో మర్నాడు కామేశాన్ని ఇరవై రూపాయలు అప్పు అడిగే పథకం రూపు దిద్దుకుంది.

ఇండోరులో సంక్రాంతి సంబరాలు - తెలుగు బ్లాగుల ప్రచారం


ఆంధ్రరాష్ట్రమంతా జనవరి 14వ తారీఖున సంక్రాంతి సంబరాలు జరుపుకుంటే ఇక్కడ ఇండోరు (మ.ప్ర.)లో ఒకింత ఆలస్యంగా ఆ సంబరాలు జరిగాయి. సంక్రాంతి లక్ష్మి రైలెక్కి ఇక్కడిదాకా రావాలి కదా మరి. (ఇక్కడ సంక్రాంతికి సెలవు ఇవ్వరు కాబట్టి ఆ తరువాత వచ్చే ఆదివారం అనువైనదిగా భావించారు). నేను ఈ సంబరాలు జరుగుతున్న చోట కారు దిగుతుంటే ముఖద్వారం గుమ్మం దగ్గర "సంక్రాంతి శుభాకాంక్షలు" అంటూ ఇద్దరు గంగెరెద్దులవాళ్ళ బొమ్మలు స్వాగతం పలికాయి. వెంటనే ఈ బొమ్మ ఎక్కడో చూసినట్టుందే అనుకున్నాను - అది నా బ్లాగులో నేను పెట్టుకున్న సంక్రాంతి శుభాకాంక్షలు బొమ్మ.

అప్పుడు గుర్తొచ్చింది ఈ కర్యక్రమం నిర్వహిస్తున్న ప్రసాద్‌గారికి, శ్రీధర్‌గారికి నేను వచ్చే విషయాన్ని మైల్ చేస్తూ, అందులో తెలుగు బ్లాగుల గురించి వివరంగా వ్రాశాను. అవకాశం వుంటే ఇండోరులో తెలుగువారికి తెలుగు బ్లాగులు పరిచయం చేస్తానని అభ్యర్ధించాను. "ఆ రకంగా నా బ్లాగులు చూసేవుంటారు" అనుకుంటూ లోపలికి అడుగుపెట్టాను. లోపలికి వెళ్ళాక నలుగురితో పరిచయమైంది. నా పేరు చెప్పగానే చాలామంది మీరు ఫలానా బ్లాగు నడుపుతారు కదూ అంటూ పలకరించారు. అప్పుడు తెలిసింది నేను పంపించిన మైలు ప్రసాద్‌గారి తెలుగు మిత్రులకి ఫర్వార్డ్ అయ్యిందని.

కార్యక్రమం మొదలు కావటానికి మరికొంత సమయం పట్టేట్టుండటంతో నాగార్జున ఫర్టిలైజర్స్ నుంచి వచ్చిన మిత్రులు ధనంజయ్‌రెడ్డిగారు, కిరణ్‌గారు కలిసి ఆ పరిసరాల్లో తిరిగాము. ఇంతకీ ఇది జరిగిందెక్కడో చెప్పలేదుకదూ - ఇండోరుకి పది పదిహేను కిలోమీటర్ల దూరంలో వున్న రాజా రామన్న సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ. పద్నాలుగు వందల ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి సహజ ప్రకృతిలో అద్భుతంగా వుందా ప్రాంతం. పూర్తిగా సెక్యూరిటీ కనుసన్నల్లో వుండే ఆ ప్రాంతంలో సైంటిస్ట్‌లు ఇతర సిబ్బంది వుండే క్వార్టర్స్, పిల్లల స్కూలు దాటి రీసర్చ్ సెంటర్ వెళ్తుంటే ఓక్క పెద్ద సహజ కోనేరు ఆహ్లాదంగా కనిపించింది. దిట్టమైన అడవిని తలపిస్తూ రోడ్డుకు ఇరువైపులా చెట్లు. అంతలో మాకు పదడుగుల దూరంలో ఒక పదిదాకా నెమళ్ళు దర్జాగా ఎదో ఫామిలీ మొత్తం మార్నిగ్‌షోకి బయలుదేరినట్టు వరసగా రోడ్డు దాటుతూ కనిపించాయి. అంత బాగుందో అలా చూస్తుంటే.. ప్రకృతిని తనపాటికి వదిలేసి మనం కేవలం ప్రేక్షులమైతే ఇంకెన్నో అధ్భుతాలు ఆవిష్కారమౌతాయేమో అనిపించి...!! నిజంగా అక్కడి వుంటున్నవారు సహజ ప్రకృతిని ఏమీ చెయ్యకుండా అందులో కలిసిపోయి జీవిస్తున్నారు... ఎంత అదృష్టం. ఎలా అనుకుంటూ మేము కార్యక్రమం జరుపుకుంటున్న వెల్ఫేర్ సెంటర్ దగ్గరకి చేరుకున్నాం.
వెంటనే టిఫిన్ల మీద పడ్డాము. "వుప్మా చేసినట్టున్నారండీ.." అని నేనంటే -
"పోహా తప్ప ఏది పెట్టినా ఫర్లేదండీ.." అంటూ ఒక బ్యాచిలరు మిత్రుడు ఆనందంగా ప్లేటందుకున్నాడు. (ఇక్కడ ఇండోరులో వుదయం దొరికే టిఫిన్ పోహ, జిలేబి మాత్రమే). మేము అలా టిఫిన్లు కానిచ్చి లోపలికి వెళ్ళి చూసే సరికి బొమ్మల కొలువు సిద్ధంగా వుంది. సాంప్రదాయాన్ని పాటిస్తూ మామిడి తోరణాలు, గడపలకి ఇరువైపులా అరటి మొలకలు అలంకరణలో సైతం చరకు గడలు, పతంగులు, బంతి పువ్వులు కనిపించి సంక్రాంతి సంబరాలకి అచ్చ తెలుగు అందాలద్దాయి.

ఆ తరువాత చిన్న పిల్లలకి ఆటల పోటీలు ఆడవారికి ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమం నిర్వహిస్తున్న సెంటర్ వాకిట్లో పోటీ నిర్వహించడంతో మరో అరగంటలో సంక్రాంతి లక్ష్మి రంగులద్దుకొని మరీ మా ముంగిట్లోలోకి వచ్చింది. పోటీలో పాల్గొన్న పెద్దలే కాక పోటీలేకపోయినా కొంతమంది చిన్న పిల్లలుకూడా ముగ్గులేసి రంగులద్ది మురిసిపోయారు. ఒక పక్క శాస్త్రిగారు తదితరుల ఆధ్వర్యంలో హిందీ వంటవాళ్ళు పులిహోర, కొత్తిమీర కారం, మామిడికాయ పప్పు లాంటి తెలుగు వంటకాలు చేస్తూ, నేర్చుకుంటున్నారు.

ఇంతలో మగవారి కబడ్డీ పోటీలు జరిగాయి. ఆడవారికి మ్యూజికల్ చైర్స్.. ఇంతలో మ్యూజిక్ సరిగా వినపడట్లేదంటూ మహిళల కంప్లైంటు..!! రమేష్‌గారు వెంటనే ఒక స్టీలు పళ్ళెం, గరిట తెచ్చిచారు. ఆ పని నేను తీసుకున్నాను.. బాపు మిస్టర్ పెళ్ళాంలో బుడుగులా.. డండర డండర డండర ఢాం..!! పోనీలే సంక్రాంతి పండక్కి జంగందేవర కూడా వచ్చినట్టైంది అన్నారెవరో సరదాగా..!!

భోజనాల దగ్గరకి వెళ్ళేసరికి పెద్ద క్యూ... ఆవకాయ అయిపోతోంది.... ఇంకో సీసా మళ్ళీ ఖాళి..!! "ఎంతైనా తెలుగువాళ్ళం కదా. అవకాయని బతకనిస్తామటండీ" అంటూ ఫణీంద్రగారు పచ్చడి గిన్నెలో అన్నం వేసి సుబ్బరంగా కలిపేసారు. ఈ ఆలోచన నచ్చి నేను పచ్చడి సీసామీద పడబోయానుగాని అంతలో శాస్త్రిగారు మరో సీసా పట్టుకొచ్చారు. కంది పొడి, నెయ్యి పులిహోర, మామిడికాయ పప్పు, సున్నుండలతో భోజన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తైంది.

ఆ తరువాత తెలుగు పురాణ సాహిత్యంలో క్విజ్.. మచ్చుకు మూడు ప్రశ్నలు -
"సీతాదేవి పుట్టిల్లు ఏది అది ప్రస్తుతం ఎక్కడుంది?"
"పంచ భీములెవరు?"
"సప్త రుషులెవరు..?"

తెలుగు బ్లాగుల ప్రచారం
మధ్యాన్నం టీ వేళకి నేను లాప్‌టాప్ తెరిచాను. ప్రసాద్‌గారి పరిచయంతో ప్రారంభించాము. ప్రసాదుగారు గత వారం రోజులలో నేను పంపిన లంకెలు పట్టుకోని తోటరాముణ్ణి, నా హాస్య దర్బారుని మరో రెండు మూడు బ్లాగుల్ని చుట్టేసారు. లంకెలు, బ్లాగడం, బ్లాగరి వంటి పదాలు అప్పుడే అక్కడ వాడకంలోకి వచ్చేసాయి. నేను ఇంకొంచెం ముందుకెళ్ళి (తాడేపల్లి గారిని తల్చుకొని) అంతర్జాలము, టైపాటు, త్రిప్పెన గురించి చెప్పాను.

అంతర్జాల అనుసంధానం లేకపోవటంతో ముఖ్యమైన లేఖిని, కూడలి మరికొన్ని సైట్లు ఆఫ్లైన్‌లో భద్రపరుచుకొని వెళ్ళాను. ముందురోజు నేను తయారుచేసుకున్న కరపత్రం పంచి పెట్టాము. "మీ కంప్యూటర్‌కి తెలుగు నేర్పించారా" అంటూ మొదలై - లేఖిని, కూడలి, తెవికి, గూగుల్ గుంపు, పొద్దు, నవతరంగం గురించి క్లుప్తంగా ఆ కరపత్రంలో వివరించాను. అందులో చివరి వాక్యం - "ఈ రోజు జరిగిన సంక్రాంతి సంబరాలు నా బ్లాగు పలక బలపంలో రేపు వస్తుంది చూడండి. "

లేఖినిలో ఇంగ్లీషు తెలుగుగా మారటం చాలామంది ఆశ్చర్యంగా, ఆనందంగా చూశారు.. శాస్త్రిగారు వచ్చి తెనాలి రామకృష్ణ చాటువులు దొరుకుతాయా అని అడిగారు.. ఫణీంద్రగారు తెలుగు సాహిత్యం దొరుకుతుందా అన్నారు.. నారాయణగారు పెద్దబాలశిక్ష, పంచతంత్రం గురించి అడిగారు. అవన్నీ అంతర్జాలంలో ఎలా వున్నాయో చెప్తూ అభినవ భువన విజయం గురించి, తెలుగు థీసిస్‌లో పుస్తకాల గురించి, సౌమ్యగారి పుస్తక సమీక్షల గురించి, సాహితీయానం వంటి కవితల బ్లాగుల గురించి, నిడదవోలు మాలతిగారి కథల గురించి వీలైనన్ని విషయాలని క్లుప్తంగా చెప్పాను. కొంతమంది ఆ బ్లాగుల పేర్లు వ్రాసుకోవటం చూసి చాలా సంతోషమనిపించింది.

చాలా మంది ప్రముఖంగా ప్రస్తావించిన విషయం: "మా పిల్లలకి తెలుగు మాట్లాడటం వచ్చు. చదవటం, వ్రాయటం నేర్పడానికి ఏవైనా వెబ్‌సైట్లు/సాఫ్ట్‌వేర్లు వున్నాయా?" ఇలా అడిగిన వారిలో ఎక్కువ శాతం ఎంతో కాలంగా ఇక్కడే స్థిరపడినవారు. సాయంత్రం అతిదిగా వచ్చిన డీ.ఐ.జీ శ్రీనివాస్‌గారు కూడా నాతో మాట్లాడినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించారు.

సాంస్కృతికం ఆ సాయంత్రం
సాయంత్రం చిన్న పిల్లల ఆటలు పాటలతో ఎంతో వుత్సాహంగా గడిచింది. మరీ చిన్న పిల్లలు ఏమాత్రం బెరుకు లేకుండా చేసిన నృత్యాలు ఎంతో అలరించాయి. ముఖ్యంగా "ముద్దుగారే యశోద" పాటకు పూర్తి క్లాసికల్ ఆహార్యంతో నటిస్తున్న ఇద్దరి పిల్లమధ్యకి మరో చిన్న పిల్లాడు అనుకోకుండా చేరి అడుగులు కలపటంతో పలువురు ఘొల్లుమన్నారు. నాకైతే పడమటి సంధ్యారాగంలో జంధ్యాల తీసిన పాట గుర్తిచ్చింది. అలాగే ముంబై 26/11 మృతులకు శ్రద్దాంజలి నృత్యం చాలా బాగుంది. మరీ ముఖ్యంగా చిన్న పిల్లల్తో సంక్రాంతి శోభను స్టేజిపై ఆవిష్కరించిన తీరు చాలా ఆకట్టుకుంది.

ఆ తర్వాత అతిధులుగా వచ్చిన ఇండోరు డి.ఐ.జీ. శ్రీనివాస్‌గారు (ఈయనది పిఠాపురం, మృదుభాషి, సహృదయుడు), ఆయన సతీమణి శ్రీమతి సుచరితగారు, ఇండోరు తెలుగు విజ్ఞాన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు రామా రావుగారు (రిటర్‌మెంట్ అయ్యిన తరువాతకూడా ఏ మాత్రం వూపు తగ్గని తెలుగు భాషాభిమాని), సీనియర్ సైంటిస్ట్ భాస్కర్‌రావుగారి చేతులు మీదుగా బహుమతి ప్రదానం జరిగింది.
తమాషా ఏమిటంటే లక్కీ డిప్‌లో నాకు బహుమతి రావటం.. అంత కన్నా లక్కీ ఏమిటంటే ఇంత మంది తెలుగువాళ్ళతో పరిచయం కావటం. అందులో ప్రసాదుగారు, శాస్త్రిగారు, ఫణీంద్రగారు, నారాయణగారులంటి సాహిత్యాభిమానులు దొరకటం..!! డిన్నర్ కానిచ్చి భారంగా ఒకరికొకరం శెలవు పుచ్చుకొని ఇళ్ళు చేరాం.

గేటు పడింది

రైల్వే గేటు పడగానే

అప్పటిదాకా పరుగెత్తుకొచ్చిన బండ్లన్ని

ఇంజెన్లు ఆపుకొని గస పెడుతుంటాయి..



బీడీ తాగుతూ నిలబడ్డ గేట్‌మాన్ కి

ఆగిన ఆటోలో పాటల రొదకన్నా

గేటు ఎక్కువసేపు వేసినందు ఇచ్చే సోడ కూత బాగా వినపడుతుంది



గేటు పడింది తమ కోసమే అని నమ్మే చిల్లర వ్యాపారమంతా

సైనికులై బస్సులమీదకి దండెత్తుతాయి

వుడకబెట్టిన శనక్కాయలు పొట్లాలైపోతాయి



చిప్స్, పాప్‌కారన్‌లు, వాటర్ పాకెట్లు, పార్లే బిస్కెట్లు, కూల్ డ్రింకులు

వీటన్నిటి దూకుడు బేరాల దెబ్బకి

చక్కిలాలు, తేగలు, నూగు జీడీలు మూగపోతాయి



అక్కడ బస్సు దిగిన బీడీ, చుట్ట, సిగిరెట్ పొగంతా

రైలుకు దీటుగా పైకిలేచి పల్చబడుతుంది

ఏ పసిపిల్లో, ముసలాడో దాన్ని ఒక్క దగ్గుతో తరిమేస్తారు



సినిమాకి లేటౌతుందని గేటు దూరిన సిల్కు చీర

మొగుడు స్కూటర్‌ని రైలొచ్చేలోపల దాటిస్తాడా లేదా అని

కళ్ళతోనే ప్రశ్నార్ధకాలేస్తుంటుంది



స్కూలు బస్సులో యూనీఫారం పిల్లలకి

గంపలో సరుకేసుకెళ్ళి అమ్మే పిల్లాడి ఆశలు

సమోస మడతల్లా ముడుచుకుపోతాయి



పగిలిపోయిన కళ్ళద్దాల ముసలమ్మ మాసిపోయిన చీరలో

ఆమె కొడుకు చెప్పు గుర్తులు..!!

కారులోనించి రూపాయి పడేసే నల్ల కోటుకి అవి కనపడవు



ఇన్ని కథలు ఇక్కడ జరుగుతుంటే

సాధారణంగా మనం ఆ రైల్లో కూర్చొని

రెప్పపాటులో అన్నిటినీ దాటిసి వెళ్ళిపోతుంటాము


(13 జనవరి 2009, లక్నోలో ఒక రైల్వే గేటు దగ్గర నిల్చున్నప్పుడు)

పతంగులు (కథ)

"దేనికి లప్పాయిస్తున్నావ్‌రా..?"


"అదేరా భై లాటీదార్‌కి..""అదా.. రోగ్ కొట్టు.. అదీ.. పేంచా..??"


"అరే డీల్ ఇదువ్‌రాభై"


"డీల్ ఏందిరా..? గుంజు... ఇది ఖీంచ్‌కట్.. డీల్ ఇడిస్తే సాదీలో పోద్ది.."


"అరే అప్ఫా.. ఛ.. మాంజ మంచిగా లేదురభై.. మంచిగుండే డప్పన్ పోయింది..."

వింటున్నానన్న మాటేగానీ ఒక్క ముక్కైనా అర్థమైతే వొట్టు. నాకు హిందీ బాగనే వచ్చు అనుకుండేవాడిని... హిందీ వస్తే హైదరాబాదులోబతికేయచ్చు అని విన్నాగాని.. ఇదేమిటి. ఆంధ్ర రాష్ట్రం నడిబొడ్డులో ఈఅర్థం కాని భాషేమిటి. నాకసలే హైదరాబాదు కొత్త. పోనీ మామగారినిబస్‌స్టాండ్‌కి రమ్మని చెప్దామంటే మరదలు, మరిది కలిసిఆటపట్టిస్తారేమో అని భయం. పెళ్ళిలో వాళ్ళుచేసిన అల్లరి ఇంకా నామనసులో మెదలుతూనే వుంది. అందుకే నాతోపాటే రమ్మంటే, కాదని శ్రీమతిపండక్కి పదిరోజులు ముందే వచ్చేసింది. ఇలాంటి వూర్లో సంబంధం చేసుకొని పండక్కొచ్చిన కొత్తల్లుణ్ణి కాకపోతే వెంటనే తిరుగు బండి ఎక్కి మా బందరు వెళ్ళిపోదును.

అత్తగారి ఇంటి ముందు ఆటో దిగుతుండగానే మామగారు నవ్వుతూ పలకరించాడు.


"రండి... అంతా మంచిగేనా..? పండగకి రెండు రోజులముందుగాని తీరికదొరక్లేదన్నట్టు..??" అన్నాడాయన.


"అబ్బే ఆఫీసులో కొద్దిగ పనెక్కువగా వుంటే.." అంటుండగానే మరదలు రవళిపరుగున వచ్చింది.


"హాయ్ బావా అచ్చినవా... నీ గురించి అక్క బేజారైతాంది.. అవు నువ్వేందట్లగడ్డం పెంచినవ్.. నీకు బెంగా..?" ఊపిరాడనీయకుండ మాట్లాడేస్తోంది.ఇంతలో అత్తగారు వచ్చారు.


"అబ్బా రవళీ అప్పుడే మొదలెట్టావా.. బావ దగ్గర బ్యాగ్ తీసుకొనిలోపలికెళ్ళు.." అంది మంచి నీళ్ళు అందిస్తూ.ఆ ఇంట్లో పాపం ఆమె మాట్లాడేదే తెలుగులా అనిపిస్తుంది నాకు. ఆమె పుట్టిల్లు రేపల్లె.

రవళి నా చేతిలో బ్యాగ్ లాక్కొని -"వుండు బావా.. అక్కతో జెప్పొస్తా.." అంటూ లోపలికి పరుగుతీసింది. కాళ్ళుకడుక్కొని మామగారితో కబుర్లు మొదలుపెట్టగానే మరిది రాజా వచ్చాడు.


"బావా ఎప్పుడొచ్చినావ్.. చలో నువ్వొచ్చినావంటే ఇంగ నాకు పతంగులేపతంగులు.. నాతోని పతంగులెగరెయ్యాల నువ్వు.."


చుట్టూ చూసి రవళి లేదని నిర్ధారించుకొని "నాకు రాదు" అన్నాను. వీడుమాత్రం ఏమన్నా తక్కువ తిన్నాడా..?


"అయ్యా.. నీకు రాదా.. పేంచ్ సరే అసలుడాయించడామే రాదా.."


"వూహు"


"ఏం ఫికర్‌జేయకు.. నేను నేర్పిస్తాలే... చలో అయితే పతంగులు మాంజా కొందాం." అని చెయ్యి పట్టుకొని లాగాడు. రవళి అల్లరి నించి, అత్తగారిభారీ మర్యాదల నుంచి తప్పించుకోవడానికి నాకొక మంచి అవకాశందొరికినట్లైంది. "సరే" అంటూ కదిలాను.


రాజా నన్నొక గాలిపటాల షాపుకు తీసుకెళ్ళాడు. నిజానికి అదొక చిన్నరేకుల షెడ్డు. ఆ షెడ్డులో ఎవరో కాపురం వున్నట్లున్నారు, వాళ్ళే ఇంటిముందు గాలిపటాలు అమ్ముతున్నట్టున్నారు. లోపలినుంచి ఒక నడి వయసు వ్యక్తిబయటికొచ్చాడు.

"ఏం గావాలె సారు.." అడిగాడు నన్ను చూసి.


"గాలిపటాలు కావాలి.." అంటూ రాజా వైపు తిరిగి "ఏది కావాలో తీసుకోరా.." అన్నాను.


"నాకు పౌండు డప్పన్ కావాలె.. తీసుకుంటూండు నేను జర్ర బోయస్తా.." అంటూపరుగు తీశాడు.


"అవేంటో నాకేం తెలుస్తాయిరా.." అన్న నా మాటలు వాడికి వినపడనట్లేవున్నాయి. ఆ నడి వయసు వ్యక్తికి మాత్రం వినపడ్డాయి.


"పౌండంటే ఈ సైజు సారు గంటే పెద్దదనంట్టు.. డప్పనంటే ఈ లెక్కపతంగుకి రెండు కళ్ళు లెక్కనుంటాయి.." అన్నాడు ఒక గాలిపటం చేతికిస్తూ.ఆ గాలిపటం చిత్రంగావుంది. మొత్తం ఒక రంగు కాగితంతో చేసి రెండుగుండ్రటి కాగితాలి వేరే రంగువి అంటించి వున్నాయి.


"అంటే ఇంతకంటే పెద్దవి వుండవా..?" అడిగాను కుతూహలంగా.


"ఉంటాయి సారు.. దాన్ని ధక్తా అంటారు... అది నా దగ్గర లేదు సారు..కావాల్నంటే రేప్పొద్దునకి ఇస్తా.."


"వద్దులే ఇదే ఇచ్చేయ్.."అతను ఇచ్చాడు -


"ఇంకేం గావాలె సారు..?" అడిగాడు.


"మంజానో ఏదో.. అడిగాడు వాడు.."


"మాంజా సారు.. అంటే ఇది" అంటూ రంగు దారపు వుండని చూపించాడు.


"ఇదెందుకు మాములు దారంతో ఎగరెయ్యకూడదా..?" అడిగాను.


"దేంతోనైనా ఎగరెయ్యచుగాని పేంచేసినప్పుడు అప్ఫా చెయ్యనీకి గావాలె కద సారు..!!"


"ఏంటో.. ఈ గాలిపటాల భాష నాకర్థం కాదులే.."


"పెంచంటే ఏంలేద్సారు... రెండు పతంగులెగరేసిన్రనుకో.. ఒక దాని మాంజాఅదే ఈ దారం ఇంకోదానికి తాకిస్తారు.. ఇద్దర్ల ఎవ్వళ్ళదో ఒక్కళ్ళది తెగేవరకు గుంజడమో.. ఇడవడమో చేస్తారు.. అదే పెంచ్ అంటే. గుంజిన్రనుకో అదిఖీంచ్ కట్, ఇడిస్తే అది డీల్.." వివరించాడతను.

"అయితే దానికీ ఈ.. ఇదేమిటి ఆ మాంజా.. ఈ మామజాకి ఏమితి సంబంధం..??" అడిగాను.


"మాంజ అంటే ఇస్పెషల్‌గా పతంగులెగరెయ్యనీకే తయారుజేస్తరనంట్టు..మంచిగున్న దారాన్ని సాదీ అంటరు. దానిని రంగు నీళ్ళల పెట్టి, అన్నం,కోడిగుడ్డు సొన, గాజుపెంకుల పొడి అన్నీ కలిపి ఆ దారానికి రుద్దుతారు.దాన్ని ఏండబెడితే అదే మాంజా అయితది..."


"అలాగా... ఈ చర్ఖా ఎంతుంటుంది..?"


"మొత్తం చర్ఖ మాంజ రెండొందలు, మూడొందలు అమ్ముతాం సారు.. "అన్నాడతను. నేను ఆశ్చర్యపోయాను.


"చాలా ఖరీదుందే.. మీకు మంచి లాభమే" అన్నాను.


"లేదు సారు.. బస్తీలకెళ్ళి ఇంక ఎక్కువకె అమ్ముతారు. ఇది నేనుజేసినాఅందుకే తక్కువలో ఇస్తన్నా.." అని అతను చెప్తుండగానే రాజా వచ్చాడు.


"ఏంటి బావా తీసుకున్నావా..?" అడిగాడు.


"లేదురా మాంజా చాలా ఖరీదుందిరా..!"


"ఏ మనకంతెందుకు బావా... ఒక్క చక్రీ దీస్కోరాదు... ముప్పైరూపయలైతది.." అన్నాడు వాడు. నేను తలాడించి ముప్పై రూపాయాలు వాడిచేతిలో పెట్టాను.


"మరి పతంగికో.." అన్నాడు. మళ్ళీ ఒక ఇరవై తీసిచ్చాను. డబ్బులిచ్చేసి అన్నాడు వాడు -

"నువ్విక్కడే వుండు బావా... మా వాడి పతగిని ఆ లంగోట్‌గాడు కోసిండు..వాడిది కోసి వచ్చేస్తా.." అల అంటూనే పరుగెత్తాడు.


"లోపలికి వచ్చి కూర్చోండి సార్" అన్నాడు ఆ కొట్టు యజమాని. నేను లోపలికివెళ్ళి కూర్చున్నాను.


"మా వాడు రెడ్‌లంగోట్ అంటున్నాడు.. అక్కడెవ్వరూ లంగోట్‌లో లేరే.." అన్నాను నేను. అతను నవ్వాడు.


"అది పతంగి పేరు సారు"


"పతంగులకీ పేర్లుంటాయా..?"


"అవును సారు.. ఈ లెక్కన ఒక కన్నుంటే గుడ్డి, పైన తలదగ్గర గీతలెక్కనుంటే నామందార్, అదే గీత కిందుంటే లంగోట్, ఇందాక మీవోడుతీసుకెళ్ళిండే గదేమో డప్పనన్నట్టు" చెప్పాడన్నట్టు.

ఆ తరువాత అతనితో మాటల్లో పడ్డాను. అతని పేరు హుస్సేన్ అని చెప్పాడతను.


"అవునూ... ఒక్క గాలిపటానికి.. అదే పతంగుకీ తోక లేదేమిటి..?? తోకలేనిగాలిపటం ఎగరదంటారు కదా..."


"గట్లేమీ లెదు సర్.. ఇక్కడెవ్వరైనా తోక పెట్టిండంటే ఆడుబఛ్ఛాగాడన్నట్టు.. దాన్ని తోక బల్లి అంటారు.. ఆడి గాలిపటాన్ని ఇంగఎవ్వరూ కొయ్యరన్నట్టు." చెప్పాడు హుస్సేన్.


"మరి ఇట్లా మాంజా తెగిన గాలిపటం ఏమైతుంది..?" అడిగాను


"మాంజ తెగినాక ఏమైతది సారు.. ఏడకనో ఎగిరిపోతది... ఏడకి పోతదోఏమౌతదో ఎర్కలేదు. ఎక్కడో పడిపోతుంది. అయినా దాన్ని పట్టలని పోరలుదాని ఎనకే వురుకుతారు.." నేను నవ్వాను. ఇంకా ఎదో పిచ్చాపాటి మాట్లాడుతుండగా పిల్లల ప్రస్తావన వచ్చింది.

"ఎంతమంది పిల్లలు నీకు..??" అడిగాను. అతని ముఖంలో భావాలు మారాయి.కొద్దిసేపట నిశబ్దం తరువాత అన్నాడు -

"ఉన్నార్లె సారు... ఇద్దరు.. ఈళ్ళతోనే పరేషాని... ఇద్దరూ గల్లీలెంటతిరగను, పోరిలిటల గానొస్తే చెడాయించను గింతనే యదవలు.." చెప్పాడు. నేనింక ఎక్కువ మాట్లాడించలేదు.

రాజా తిరిగి వస్తూనే -"అఫ్హా.. బావా అఫా.. మాంజా మంచిగుంది తాకించంగనే ఆళ్ళది పోయింది.."అన్నాడు సంబరంగా. ఇద్దరం బయటికి వచ్చి ఇంటికి బయల్దేరాం.నాలుగడుగులు వేసామో లేదో ఇద్దరు యువకులు వచ్చి ఆపారు.

"ఎంది బే.. మ పతంగినే అఫాజేస్తావుర... దమాకిట్ల ఖరాబైందిరా..??"అన్నాడొకడు రాజాతో

"ఏం.. మీరు మాది కొయ్యలే... గట్లనే.." అన్నాడు వీడు. నాకు భయంగానే వుంది.

"ఏంరో..! ఆవాజ్ జేస్తుండవ్... మెం జేస్తే నువ్ జేస్తవ్..??" అంటూమీదకొచ్చాడు. ఇంతలో హుసేన్ బయటికి వచ్చాడు.

"రేయ్.. వొదల్రా .. పతంగులెగరేసేది.. పేంచెయ్యడానికి కాదారా..ఫోండి.."అన్నాడు మా దగ్గరకు వస్తూ.

"మళ్ళీ మా పతంగ్ తట్టు వస్తే బతకవ్ బిడ్డా.." అంటూ వెళ్ళిపోయారు ఇద్దరూ.

"ఎవరు హుసేన్ వాళ్ళు.." అడిగాను.

"ఆళ్ళే సారూ నా బిడ్డలు.." అన్నాడతను కిందకి చూస్తూ.

***

ఆ తరువాత చాలారోజులు మళ్ళీ హుసేన్‌ని కలవలేదు నేను. మా మామగారికి విజయవాడ ట్రాన్స్ఫర్ అవటంతో మళ్ళీ నాకు హైదరాబాదు వెళ్ళాల్సినఅవసరం రాలేదు. కానీ హుసేన్ మాత్రం అప్పుడప్పుడు గుర్తుకువచ్చేవాడు. అతనెలా వున్నాడో.. అతన్ని కొడుకులు చూస్తున్నారాలేదా అని అనుకునేవాడిని. మళ్ళీ నాకే అనిపించేది అతన్ని చూసుకోవల్సిన అవసరమేమిలేదు.. హుసేన్ తనబ్రతుకెదో తను బ్రతుకగలడు. అతనికేమైనా అయితే అతని కొడుకులేకష్టపడాలి అని. ఇట్లాగే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి.

మళ్ళీ ఆఫీస్ పనిమీద ఒకసారి హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. పని అయిన తరువాత నేనుండే హోటల్ హుసేన్ ఇంటికి దగ్గరే కావటంతో ఒక సాయంత్రం అటువైపు నడుచుకుంటూ వెళ్ళాను. ఆ పరిసరాలన్నీ చాలావరకు మారిపోయాయి. ఆ పతంగుల కొట్టు వుండాల్సిన చోట ఓక పాన్ షాప్, ఒక సెలూన్ వెలిసాయి. నేను పాన్ షాప్ దగ్గరకి వెళ్ళాను.


"బాబూ ఇక్కడ హుసేన్ అని వుండెవాడే.. అతనెక్కడుంటున్నాడు..??"

"ఏమాయె.. మీకెమైనా చుట్టమా..?" అడిగాడు.

"అబ్బేలేదు.. తెలిసినతను అంతే.." అన్నాను.

"ఆడు పోయి కరీబ్ ఏక్‌సాలైంది సాబ్.." అన్నాడతను. దూరంగా పతంగులు ఎగరేస్తున్న పిల్లలు అరుస్తున్నారు -

"పేంచ్.. పేంచ్..""మరి అతని కొడుకులు..." అడిగాను నేను.

"ఆళ్ళ సంగతేం అడుగుతార్లే సాబ్.. ఒకడెవర్నో ఖూనీ చేసిండని జైల్లో ఏస్తే ఆడకెళ్ళి పారిపోయిండు... ఇప్పుడేడున్నడో తెల్వదు.."

"మరి రెండోవాడు.." అడిగాను ఆతృతగా.

"ఆళ్ళెవరో కొట్టిన్రంట దవాఖానాలో వున్నడు.." అన్నాడు.

"అఫా.. అప్ఫా కటీ... పిల్లలు ఆనందంగా ఎగురుతున్నాడు. పిల్లలు కోసిన గాలిపటం ఎటో ఎగిరిపోయింది.హుసేన్ మాటలు గుర్తొచ్చాయి - "మాంజ తెగినాక ఏమైతది సారు.. ఏడకనో ఎగిరిపోతది... ఏడకి పోతదో ఏమౌతదో ఎర్కలేదు. ఎక్కడో పడిపోతుంది"

(2001)

రాజుగారు - రాజమహలు - రాజ్‌కపూర్ - రాజ్‌దూత్

ఈమధ్య ఆఫీసు పనిమీద రత్లాం (మధ్యప్రదేశ్) దగ్గర ఒక చిన్న గ్రామానికి వెళ్ళాను. అక్కడ నేను కలవాల్శిన వ్యక్తి రాజవంశీయుడు. ఎప్పుడో ఆయన ముత్తాతగారు ఆ ప్రాంతాన్ని పరిపాలించారట. ఇప్పటికీ అదే తరహాలో పురాతన మహలులో ఆయన నివాసం.

అడుగుపెడుతూనే పెద్ద రాజద్వారం. ఇదుగో ఇలా...




ఆ పైన ఒక పురానీ హవేలి (పురాతన మహలు)... ఇలా




నాకెందుకో సితార సినిమా గుర్తొచ్చింది. మరీ ముఖ్యంగా శరత్‌బాబు హుందాగా భవంతి బయట మాట్లాడి లోపలికెళ్ళి కోటు విప్పితే చొక్కాకి చిరుగు కనపడుతుందే ఆ సీను...

వెంటనే - "సార్ మరి ఇంత పెద్ద భవంతిని మైన్‌టైన్ చెయ్యాలంటే కష్టం కాదూ" అన్నా ఆరాతీస్తూ..

నేననుకున్నది నిజమే.. ఆయన భోరున ఏడ్చినంత పని చేసాడు. "ఏం చేస్తాం సార్.. ఈ భవంతిని వూడ్చడానికే ఒక నౌకరున్నాడు.. ఇంకా గుర్రాలు ఏనుగులను మొన్నే వదిలించుకున్నాను" అన్నాడు ఆ ఏనుగు అంబారీ ఫోటో చూపిస్తూ. నాకు అర్థమైపోయింది... ఈయన శరత్‌బాబే..!!

కానీ ఆ ఇంటిని (కనీసం మేము కూర్చున్న రాణీగారి గదివరకైనా) చక్కని పురాతన వస్తువులతో, ఆయన వంశం రాజుల బొమ్మలతో చక్కగా అలంకరించారు. మరీ ముఖ్యంగా నాకు నచ్చింది ఇదుగో ఈ గ్రాముఫోను..




ఇది ఇంక పనిచేస్తోంది సుమండి.. చక్కని రాజ్‌కుమార్ పాటలు వినిపించారాయన కీ ఇచ్చి.

కొసమెరుపేమిటంటే ఒకప్పుడు గుర్రాలను ,ఏనుగులను కట్టేసే చోట 1957 నాటి ఒరిజినల్ రాజ్‌దూత్ బండి వుండటం. అప్పట్లో బండ్లు తక్కువ కావటం మూలాన అట్టే రిపేరు షాపులు వుండేవి కావట. అందుకే ఈ బండి సైలెన్సరు పైన ఒక గాలి పంపు, పంచర్లు వేసుకునే సామాగ్రీ పక్కన పెట్టెలో వున్నాయి. ఇది ఇప్పటికీ పనిచేస్తోంది... రాజావారి ప్రయాణం రోజూ దీని మీదే -



(కొన్ని కారణాలవల్ల ఆయన పేరు ఫోటోలు ఇక్కడ వ్రాయలేను..)